టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

18 Sep, 2018 12:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను మంగళవారం హైదరాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోడె ప్రసాద్‌పై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదుచేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బోడే ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె ఆగస్టులో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్‌ కమిషనర్, పెనమలూరు ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా నేడు రోజా పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్‌ విచారణలో రోజా తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

>
మరిన్ని వార్తలు