బెజవాడ పాతబస్తీలో దారుణ ఘ‌ట‌న‌! క్యాట‌రింగ్‌ బాయ్‌..

15 Dec, 2023 12:24 IST|Sakshi

యజమానిని నరికి చంపిన క్యాటరింగ్‌ పని వర్కర్‌

నగదు లావాదేవీలపై వివాదంతోనే ఘాతుకం

విజయవాడ: పాతబస్తీలో గురువారం సాయంత్రం దారుణహత్య చోటు చేసుకుంది. రద్దీగా ఉండే ప్రాంతంలో అనూహ్యంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గుగ్గిలం ఏసుబాబు (వాసు) (45) క్యాటరింగ్‌ పనులు చేస్తూ జీవిస్తుంటాడు. ఈయన పలువురికి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాడు. అతని వద్ద నాగార్జున అలియాస్‌ గణేష్‌ అనే యువకుడు క్యాటరింగ్‌ పనులు చేస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా రూ.5 వేల నగదుకు సంబంధించి గొడవ జరుగుతోంది. క్యాటరింగ్‌ పనులు చేసేవారంతా రమణయ్య కూల్‌డ్రింక్‌ షాప్‌ సెంటర్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా తిరుగుతూ ఉంటారు.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో నాగార్జున ఏసుబాబుతో గొడవకు దిగినట్లు తెలిసింది. ఆ క్రమంలో ఏసుబాబు నాగార్జునను గట్టిగా అరవటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ క్రమంలో క్యాటరింగ్‌ సామగ్రిలోని మటన్‌ కొట్టే కత్తితో నాగార్జున ఏసుబాబుపై దాడి చేయటంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న వన్‌టౌన్‌ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సురేష్‌బాబు తెలిపారు.

>
మరిన్ని వార్తలు