పరాయిగడ్డపై భార్యను కడతేర్చాడు..

20 May, 2018 16:13 IST|Sakshi
భార్య జెస్సికా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త మితేష్‌ పటేల్‌

లండన్‌ : బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన వారిద్దరూ ప్రేమించి పెళ్లాడారు..అన్యోన్య దాంపత్యంతో పరాయిగడ్డపైనా పలువురి మన్నన పొందారు. ఇంతలోనే వారి కాపురంలో ఏం కల్లోలం చెలరేగిందో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. లండన్‌లో ఫార్మసీ దుకాణాన్ని నిర్వహిస్తున్న జెస్సికా పటేల్‌ను భర్త మితేష్‌ పటేల్‌ దారుణంగా హతమార్చినట్టు పోలీసులు అభియోగం నమోదు చేశారు. 34 సంవత్సరాల జెస్సికా పటేల్‌ను భర్త మితేష్‌ పటేల్‌ (36) హతమార్చాడని టెసీడ్‌ మేజిస్ర్టేట్‌ కోర్టులో విచారణ చేపట్టారు.

జెస్సికా పటేల్‌ భర్తతో కలిసి మిడిల్స్‌బోరోలో గత మూడేళ్లుగా తమ ఇంటికి సమీపంలోనే మందుల దుకాణం నడిపిస్తున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్ధానికులు చెబుతున్నారు. ఇంతలో ఏమైందో గత వారం జెస్సికా తన ఇంటిలోనే విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక నిపుణులు, ఫోరెన్సిక్‌ బృందాలు నేర విచారణలో నిమగ్నమయ్యాయి.

పోస్ట్‌మార్టమ్‌ నివేదిక వివరాలను విచారణ నిబంధనల ప్రకారం వెల్లడించడం లేదని పోలీసులు తెలిపారు. జెస్సికా తమను ఎంతో ప్రేమగా చూసుకునేవారని, కుటుంబానికి అంకితమై సేవలు అందించారని , ఆమె మరణం తమకు కోలుకోలేని విషాదమని కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారని క్లీవ్‌లాండ్‌ పోలీసులు తెలిపారు. భార్యతో ఎంతో ప్రేమగా మెలిగే మితేష్‌ పటేల్‌ జెస్సికాను ఎందుకు హత్య చేశాడన్నది స్ధానికులకు అంతుపట్టడం లేదు. విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు