కట్టుకున్నోడే కడతేర్చాడు

16 Jul, 2019 11:46 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఖేడ్‌ డీఎస్పీ సత్యనారాయణరాజు

సాక్షి,మెదక్‌ : నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తిలో భార్య, కొడుకును హత్యచేసిన సంఘటనను పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నారాయణఖేడ్‌ డీఎస్పీ సత్యనారాయణరాజు, ఖేడ్‌ సీఐ వెంకటేశ్వరరావులు స్థానిక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం ప్రకారం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన చింతాకి వెంకట్‌రెడ్డి(32) ఈనెల 12న తన భార్య కవిత(28), కొడుకు దినేష్‌రెడ్డి(04)లను మధ్యాహ్నం భోజన సమయంలో తినే కూరలో మత్తుపదార్థం కలిపిడాన్నారు.

తదనంతరం కాసేపటికి వారు నిద్రలోకి వెళ్లారని.. ఆ సమయంలో ఇంట్లో పూజగదిలోకి తీసుకెళ్లి భార్యపైన, కొడుకుపైన కిరోసిన్‌ పోసి నిప్పంటించాడని తెలిపారు. అనంతరం డ్రెస్‌ మార్చుకుని బయటకు వెళ్లి తనకు ఏమి తెలియనట్లు వ్యవహరించి ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేశాడన్నారు. రాత్రి ఇంటివద్ద ఉన్న తుఫాన్‌ వాహనం తీసుకెళ్లే ప్రయత్నంలో సమాచారం పోలీసులకు అందడంతో నిందితున్ని తమ అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నాడు. 

అనుమానం, ఆస్తి తగాదాలే కారణం 
తన భార్య కవితపై వెంకట్‌రెడ్డికి పలు అనుమానాలు ఉండేవని, వీటితోపాటు తనకు జన్మించిన కుమారుడు సైతం తనకు పుట్టలేడని అనుమానలు ఉండేవన్నారు. తన గ్రామంలో ఉన్న భూమిలో ఒక ఎకరం భూమి అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఒక తుఫాన్‌ వాహనం కొనుగోలు చేశాడన్నారు. కాగా మిగిలిన డబ్బులను మద్యం తాగుతూ జల్సా చేశాడన్నారు. దీంతో డబ్బులు అయిపోవడంతో తన భార్య పేరుమీదుగా ఉన్న భూమిని అమ్ముదామని నిత్యం భార్యను వేదింపులు చేసేవాడని ఇదే క్రమంలో భార్య ఒప్పుకోకపోవడంతో భార్యను హతమార్చి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నాడని తెలిపారు.

ఈ క్రమంలోనే పలు మార్లు గొడవలు జరుగగా పెద్దల సమక్షంలో పలు పంచాయితీలు సైతం చేశారన్నారు. హత్యరోజున వెంకట్‌రెడ్డి భార్య కవిత తన అన్నకు ఫోన్‌చేసి తన కుమారున్ని తీసుకెళ్లాలని కోరిందన్నారు. కాగా అంత లోపే భర్త వెంకట్‌రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడటం జరిగిందన్నారు. కాగా నిందితుని జహీరాబాద్‌ కోర్టులో హాజరుపర్చి రింమాండ్‌కు పంపడం జరుగుతుందన్నారు. సమావేశంలో నాగల్‌గిద్ద, మనూరు ఎస్‌ఐలు శేఖర్, నరేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.  

మరిన్ని వార్తలు