సాక్షి, కరీంనగర్ : నగరంలోని విద్యానగర్లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాధిక తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఇంట్లోకి చోరబడిన దుండగుడు ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో రాధిక అక్కడికక్కడే మృతిచెందారు. కూలీ పనులకు వెళ్లిన రాధిక తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో శవమై కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చెబుతున్నారు.