అంతర్రాష్ట్ర జేబు దొంగ దొరికాడు

12 Apr, 2018 11:58 IST|Sakshi
స్వాధీనపర్చుకున్న బంగారం, నగదును చూపిస్తున్న ఏసీపీ

బహిరంగ సభ జరుగుతున్నదంటే..

వీఐపీ పర్యటన సాగుతున్నదంటే..

అతడికి పండగే పండగ.. అంతులేని ఆనందం..!

క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతాడు..!!

అతడేమైనా నాయకుడా..? ఏదేని అధికారా..?

నాయకుడు కాదు, అధికారి కాదు.. ఓ జేబు దొంగ..!!!

కూసుమంచి: అంతర్రాష్ట్ర జేబు దొంగను కూసుమంచి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. అతని నుంచి ఇండికా కారు, 18వేల రూపాయల నగదు, 12 తులాల బంగారం స్వాధీనపర్చుకున్నారు. కూసుమంచి సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్‌ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి తెలిపిన వివరాలు...

గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం ప్రకాష్‌నగర్‌కు చెందిన ఉప్పు పిచ్చయ్య, గత 15 సంవత్సరాలుగా జేబు దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నాడు. బహిరంగ సభల్లో, వీఐపీల పర్యటనల్లో జనం రద్దీగా ఉన్నప్పుడు తన చేతివాటం ప్రదర్శించి జేబు దొంగతనాలు చేస్తున్నాడు.
ఈ నెల 7వ తేదీన కూసుమంచిలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ప్రారంభమైంది. బ్యాంక్‌ లాకర్‌లో దాచేందుకని 12 తులాల బంగారం తో తిప్పారెడ్డి రంగారెడ్డి అనే రైతు వచ్చాడు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన తరువాత బ్యాంకుకు వెళ్దామనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత చూసుకుంటే.. తన బంగారాన్ని ఎవడో కాజేశాడు. ఇదేరోజున ఖమ్మం నగరానికి చెందిన యువకుడు రమేష్‌ వద్దనున్న 18వేల రూపాయల నగదు కూడా మాయమైంది.
వీరిద్దరి ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యా రు. జేబు దొంగల కోసం నిఘా వేశారు. మరుసటి రోజున, జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లో కాం గ్రెస్‌ బహిరంగ సభలోలోనూ ఓ దొంగ చేతివాటం ప్రదర్శించినట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది.
మొత్తానికి ఆ జేబు దొంగను కనిపెట్టారు. కారులో సూర్యాపేట వెళుతున్న ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే.. గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం ప్రకాష్‌నగర్‌కు చెందిన ఉప్పు పిచ్చయ్య,
అతని నుంచి కారుతోపాటు కూసు మంచిలో కొట్టేసిన 12 తులాల బంగారం, 18వేల రూపాయల నగ దు, పర్సులోగల నాలుగు విదేశీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లో ఇతడు అనేక జేబు దొంగతనాలకు పాల్పడ్డాడు.
ఇతడిని పట్టుకున్న ఎస్‌ఐ రఘును, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. వారికి మెమెంటోలు, క్యాష్‌ రివార్డులు అందించారు. సమావేశంలో సీఐ జాఠోత్‌ వసంత్‌కుమార్, ఎస్‌ఐ రఘు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు