లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

5 Apr, 2018 11:26 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న విజయభాస్కరరావు

ఒంగోలు క్రైం:లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సాయంత్రం ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కంభంకు చెందిన వి.విజయభాస్కరరావు (50) సోమవారం అర్ధరాత్రి ఒంగోలు వచ్చాడు. స్థానిక బస్టాండ్‌ సమీపంలోని సాగర్‌ సెంటర్‌లో గల ఓ ప్రైవేట్‌ లాడ్జిలో రూమ్‌ తీసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు లాడ్జి నిర్వాహకులకు కూడా కనిపించాడు. సాయంత్రం తలుపు వేసి ఉండటాన్ని గమనించిన లాడ్జి నిర్వాహకులు.. కాలింగ్‌ బెల్‌ కొట్టి చూశారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో రాత్రి 9.30 గంటల సమయంలో ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా ఎస్సై దాసరి రాజారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

గదిలోపల గడియలు తొలగించి లోనికి ప్రవేశించిన పోలీసులు.. విజయభాస్కరరావు విగతజీవిగా మారి ఉండటాన్ని గమనించారు. రూమ్‌లోని బెడ్‌ మీద పురుగులమందు డబ్బా ఉంది. ఆ పక్కనే అతను స్వహస్తాలతో రాసిన సూసైడ్‌ నోట్‌ ఉంది. అక్కడే ఉన్న సెల్‌ఫోన్‌తో విజయభాస్కరరావు కుటుంబ సభ్యులకు ఎస్సై రాజారావు సమాచారం అందించారు. ‘నా స్థలాన్ని అమ్మి అప్పులు తీర్చండి, కాలేజీలో ఉన్న నా సహచరులకు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని చెప్పండి, పరిమళను మంచిగా చూడమని చెప్పండి, బన్ని.. మమ్మీని, చెల్లిని జాగ్రత్తగా చూసుకో, ముఖ్యంగా ఎవరినీ ద్వేషించవద్దు, అందరినీ ప్రేమించు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. లైఫ్‌లో నేను అన్ని విధాలుగా ఫెయిలయ్యాను. అందుకే జీవితం మీద విరక్తితో తనువు చాలిస్తున్నా. పోలీసులకు నా విన్నపం. నా బాడీని కంభం చేర్చగలరు’ అని సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్సై దాసరి రాజారావు తెలిపారు.

మరిన్ని వార్తలు