‘ఈ కేసులో క్షుద్ర పూజల అంశం లేదు’

24 Jan, 2019 11:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని సంచలనం రేపిన లంగర్‌హౌస్‌ జంట హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్కాచెల్లెళ్లైన యాదమ్మ, సుమిత్రలను ఒకే వ్యక్తి చంపినట్లు పేర్కొన్నారు. మృతుల తలలపై బలమైన గాయాలు ఉండటంతో క్షుద్రపూజల కోసమే నరబలి ఇచ్చారంటూ అనుమానాలు నెలకొనడంతో.. ఈ కేసును ఛాలెంజింగ్‌గా భావించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు. ఈ సందర్భంగా వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కమ్మల కోసమే నిందితుడు మహిళలను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ హత్యలో క్షుద్ర పూజల అంశం లేదని స్పష్టం చేశారు. నిందితుడిని మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు.

కాగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన దంపతులు రాజు–యాదమ్మ, లక్ష్మణ్‌–సుమిత్ర 15 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం సిటీకి వలసవచ్చారు. వీళ్లు ప్రస్తుతం మీర్‌పేట పరిధిలోని బాలాపూర్‌ చౌరస్తా సమీపంలో ఉన్న లెనిన్‌నగర్‌లో నివసిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు అయిన యాదమ్మ, సుమిత్రలు సమీపంలోని ఇళ్లల్లో పని చేస్తుండగా... రాజు, లక్ష్మణ్‌లు అడ్డా కూలీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు చొప్పున సంతానం. సుమిత్ర భర్త లక్ష్మణ్‌ మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం చనిపోయాడు.

మరిన్ని వార్తలు