సాక్షి, పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్): ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చిన అడవిపందిని ఢీకొట్టడంతో కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని ముష్టిపల్లి గేట్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. లింగాల మండలం అంబట్పల్లికి చెందిన ఆవుల శంకర్(40) తన ద్విచక్రవాహనంపై గురువారం తెల్లవారుజామున నాగర్కర్నూల్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముష్టిపల్లి గేట్ సమీపంలో అకస్మాత్తుగా అడవిపంది అడ్డం రావడంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కిందపడిన శంకర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన నాగర్కర్నూల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. శంకర్కు భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
స్వగ్రామంలో విషాదఛాయలు
లింగాల (అచ్చంపేట): మండలంలోని అంబట్పల్లికి చెందిన ఆవుల శంకర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగర్కర్నూల్లో ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. శంకర్ ఆకస్మిక మృతితో సర్పంచ్ నాగ రవిశంకర్, పలువురు గ్రామపెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.