ప్రేమజంట ఆత్మహత్య

21 Mar, 2019 13:34 IST|Sakshi
చిత్ర, శ్రీనివాసన్‌ మృతదేహాలు

టీ.నగర్‌: తలైవాసల్‌ సమీపంలో ప్రేమజంట విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. సేలం జిల్లా, తలైవాసల్‌ సమీపం తెడావూరు గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌ (45). భవన నిర్మాణ కార్మికుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సెల్వరాణికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా ఐదేళ్ల క్రితం సెల్వరాణి తన ముగ్గురు పిల్లలతో భర్తను వదిలి విడిగా ఉంటోంది. ఇదిలాఉండగా రెండో భార్య రాణి మూడేళ్ల క్రితం మృతిచెందింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కార్మికుడైన శ్రీనివాసన్‌ అనేక ప్రాంతాల్లో పనులకు వెళ్లేవాడు. గతేడాది చెన్నైకు వచ్చి కేకే.నగర్‌లో పనిచేస్తూ వచ్చాడు. ఆ సమయంలో అక్కడకు పెరంబలూరు జిల్లా, పూలాంబాడి కరికాలన్‌ వీధికి చెందిన  రాజు అనే వ్యక్తి తన భార్య చిత్ర (41)తో నిర్మాణ పనులకు వచ్చాడు.

వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదిలాఉండగా పనికి వెళ్లిన స్థలంలో శ్రీనివాసన్‌కు చిత్రతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ స్థితిలో నాలుగు రోజుల క్రితం పనికి వెళ్లిన చిత్ర తిరిగిరాలేదు. ఆమె కోసం భర్త గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇదిలాఉండగా చిత్ర, ప్రియుడు శ్రీనివాసన్‌తో సోమవారం సేలం జిల్లాకు వచ్చింది. వీరకనూర్‌ సమీపానగల తెన్‌కనూరు గ్రామంలో శ్రీనివాసన్‌ పెదనాన్న గణేశన్‌ ఇంట్లో వీరు బసచేశారు. మంగళవారం ఉదయం వీరు ఉంటున్న గది తలుపులు చాలాసేపటి వరకు తెరుచుకోలేదు. అనుమానించిన గణేశన్‌ తలుపులు తెరిచి చూడగా చిత్ర, శ్రీనివాసన్‌ ఇరువురూ విషం సేవించి విగతజీవులుగా కనిపించారు. అతడు వెంటనే వీరకనూరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి వచ్చి ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. దీనిపై చిత్ర భర్త రాజుకు పోలీసులు సమాచారం తెలిపారు. కేసు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు