ప్రణయ్‌ హత్యకేసు : రక్షణ కోరుతున్న ప్రేమజంటలు

18 Sep, 2018 21:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసుతో మరికొన్ని ప్రేమ జంటలు భయాందోళనలకు గురవుతున్నాయి. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కులాంతర వివాహం చేసుకున్నందుకు మూడు నెలలుగా తమ బంధువులు వేధిస్తున్నారని మీడియా ముందు నవదంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన బండి శివదీప్తి రెడ్డి, కడపకు చెందిన మురహురి విజయ్‌ కుమార్‌లు జులై 26న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత అమ్మాయి బంధువులు భర్తను వదిలి రావాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తన బంధువులు పోలీస్‌ శాఖలో ఉన్నత పదవుల్లో ఉండటంతో విజయ్‌కు ప్రాణహాని ఉందని దీప్తి రెడ్డి మీడియాకు చెప్పారు.

ఏలూరులో ప్రేమ జంటకు బెదిరింపులు
తాడేపల్లి గూడెంకు చెందిన సంపత్‌ కుమార్‌, గుంటూరు జిల్లా నడింపేట మండలం చేబ్రోలుకు చెందిన నహ్రీన్‌లకు ఏలూరులో బౌద్ద ప్రచార ట్రస్ట్‌లో మంగళవారం మతాంతర వివాహం జరిగింది. అయితే నహ్రీన్‌ తండ్రి తన కూతురిని పంపకపోతే అంతు చూస్తామంటూ యువకుడి బంధువులను బెదిరించారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించి మహిళా పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు