ఘోర ప్రమాదం: 13 మంది మృతి

6 Mar, 2020 09:27 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రెండు కార్లు ఢీకొట్టుకున్న ఘటనలో 13మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తుంకూరు జిల్లా కొణిగల్‌ తాళూకా బెంగళూరు- మంగళూరు హైవేపై గురువారం రాత్రి 12.30 ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి బెంగళూరు నుంచి ధర్మస్థలం వెళుతున్న బ్రీజా కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పల్టీ కొట్టి,  ఎదురుగా ధర్మస్థలం నుంచి బెంగళూరు వెళుతున్న చెవర్‌లెట్‌ కారును ఢీకొట్టింది. దీంతో బ్రీజా కారులో ఉన్న ముగ్గురు యువకులు, చెవర్‌లెట్‌లో ప్రయాణిస్తున్న 10మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వన్‌వే రోడ్డు కావటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగినపుడు బ్రీజాలో 10మంది, చెవర్‌లెట్‌లో 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చెవర్‌లెట్‌లో ప్రయాణిస్తున్న వారిని తమిళనాడు వాస్తవ్యులుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాద ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉండటం పలువురిని కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు