పోలీస్‌స్టేషన్‌లోనే భార్యపై దాడి

18 Oct, 2018 12:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో జరగడం గమనర్హం. వివరాలు..యాప్రాల్‌కు చెందిన రెహమాన్‌, రసూల్‌ పురాకు చెందిన కౌసర్‌ బేగంకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కౌసర్‌ బేగం బేగంపేట పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది. రెహమాన్‌ మద్యానికి బానిస కావడంతో కౌసర్‌ బేగం భర్తకు దూరంగా ఉంటూ తల్లి ఇంట్లో ఉంటోంది. ఎనిమిది నెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఇటీవల తాగడానికి డబ్బుల కోసం భార్య కౌసర్‌ బేగం వద్దకు వచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బేగం పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కౌసర్‌ బేగం తల్లిదండ్రులు, చెల్లితో కలిసి వచ్చింది. భార్యపై కోపంతో కత్తితో పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశాడు. అడ్డొ చ్చిన కుటుంబసభ్యులను కూడా కత్తితో గాయపర్చాడు. ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు