పెళ్లి చేసుకోమన్నందుకు.. ప్రియురాలి సజీవదహనం

4 May, 2019 10:08 IST|Sakshi

పుదుచ్చేరిలో ప్రియుని ఘాతుకం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమిస్తున్నానని అంటే నమ్మింది. సన్నిహితంగా మెలగడంతో గర్భందాల్చింది. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ప్రియుని చేతిలో సజీవదహనమై పోయింది. పుదుచ్చేరిలో చోటుచేసుకున్న ఈ ఘోర ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరి ఆరోరాలోని జీడిమామిడి తోటలో కాలిపోయిన స్థితిలో సుమారు 20 ఏళ్ల వయసున్న యువతి శవాన్ని గతనెల 30న పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. యువతి ముఖం పూర్తిగా కాలిపోయి ఉండడంతో ఆమె ఎవరో గుర్తించేందుకు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈనెల 2న ఆరోరా పోలీసుస్టేషన్‌కు అప్పాదురై అనే యువకుడు వచ్చి తన అక్క మూడురోజులుగా కనపడడం లేదని ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు అప్పాదురై, అతని తల్లి మనోరంజితం, ఇద్దరు సోదరిలను పుదుచ్చేరి బీమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి యువతి శవాన్ని చూపగా ఆమె లక్ష్మీనేనని గుర్తించి గుండెలవిసేలా రోదించారు. హతురాలు లక్ష్మి పుదుచ్చేరి నెహ్రూ వీధిలోని దుకాణంలో పనిచేస్తుండగా అదే దుకాణానికి చెందిన వాహన డ్రైవర్‌ అరుణకుమార్‌తో స్నేహం ఏర్పడిందని, గత నెల 29న దుకాణానికి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన లక్ష్మి తిరిగి రాలేదని తల్లి మనోరంజింతం పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు అరుణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన స్నేహితునితో కలిసి లక్ష్మీని హత్యచేసినట్లు అంగీకరించాడు.  

మరిన్ని వార్తలు