గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
సాక్షి, కేకే.నగర్(చెన్నై): మనం నిద్రలో ఉన్నప్పుడు కలలు రావడం సహజం. మన ఊహలకు అందనివి మన కలలో జరుగుతుంటాయి. అందులో కొన్ని సంతోష పెట్టేవి ఉంటాయి. మరికొన్ని భయబ్రాంతులకు గురి చేసేవీ ఉంటాయి. అలాంటి ఓ కల ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. కలలో తన గొంతును తానే కోసుకుని మృతిచెందినట్లు భావించిన ఓ యువకుడు నిజ జీవితంలో అలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై తాంబరం సమీపంలో శుక్రవారం జరిగింది.
బంధువుల కథనం మేరకు.. తాంబరం సమీపంలోని బాలాజీనగర్కు చెందిన బాలకృష్ణన్(35) ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. ఇతను కత్తితో తన గొంతును తానే కోసుకుని చనిపోయినట్లు తరచూ కలలు కనేవాడు. వేరే ఇంట్లో ఉంటే కలలు రావని బాలకృష్ణన్ వారం క్రితం పల్లావరం ఇస్మాయిల్ రోడ్డు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం వంట గదిలో గొంతు కోసుకున్న స్థితిలో స్పృహ తప్పి పడి ఉన్నాడు. గమనించిన బంధువులు అతన్ని పల్లావరంలోని ఆస్పత్రికి తరిలిస్తుండగా మృతిచెందాడు. పల్లావరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.