రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ముగ్గురికి తీవ్ర గాయాలు
వల్లూరు: కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై మండలంలోని తప్పెట్ల బస్టాపు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్. శ్రీనివాసులురెడ్డి ( 42) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు., మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కడప రామాంజనేయపురానికి చెందిన షేక్ మౌలాలి ఆటో నడుపుకుని జీవించేవాడు. ఇతను మంగళవారం సాయంత్రం కడప నుంచి కమలాపురానికి ప్రయాణికులను తీసుకుని వచ్చాడు. హైదరాబాదులోని హెటిరో ఫార్మా కంపెనీలో పని చేస్తున్న కమలాపురం మండలం బయనపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డి తన తల్లిని చూసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి హైదరాబాదుకు వెళ్లడంలో భాగంగా కడపకు వెళుతూ కమలాపురం క్రాస్ వద్ద ఆటో ఎక్కాడు.
ఇతనితో పాటు పెద్ద చెప్పలికి చెందిన షరీఫున్ అనే మహిళ, చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన ముండ్ల కిషోర్ కుమార్రెడ్డిలు ఆటో ఎక్కారు. వల్లూరు మండలం తప్పెట్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను కడప వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఏపీ 04 టీడబ్లు్య 6769 నంబరు గల లారీ ఢీ కొంది. దీంతో ఆటో పూర్తిగా దెబ్బతినగా శ్రీనివాసులురెడ్డి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ మౌలాలి, కిషోర్ కుమార్రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. షరీఫున్ తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరింది. దీంతో రెండు 108 వాహనాలలో వీరిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. కాగా మృతుడు శ్రీనివాసులురెడ్డికి భార్య , ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు బంధువులు తెలిపారు.