గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి

21 Mar, 2019 10:08 IST|Sakshi
ప్రమాదంలో కాలి బూడిదయిన ఇంటి సామగ్రి, మృతి చెందిన గుర్రప్ప

సాక్షి, రాయచోటి టౌన్‌ : పట్టణంలో మంగళవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలి తానిగుండ పెద్ద గుర్రన్న (35) మృతి చెందాడు. ఈ సంఘటనతో చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నాకటలోని బళ్లారికి చెందిన తానిగుండ పెద్ద గుర్రన్న  పాత రాయచోటికి చెందిన సుజాతను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. గుర్రన్నకు టీబీ జబ్బు ఉండటంతో ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో భార్య వైద్యం చేయిస్తోంది. సోమవారం వైద్యులను సంప్రదించగా జబ్బు నయం అయినట్లు చెప్పారు. ఈ క్రమంలో రెండు రోజులు పుట్టింటిలో ఉండి వెళ్లాలని అనుకొని ఇక్కడే ఆగిపోయారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి అర్థరాత్రి దాటాక ఒక్క సారిగా గ్యాస్‌ సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలింది. మంటల్లో నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో భార్య భర్తలకు నిప్పు అంటుకుంది. గుర్రన్నకు మంటలు ఎక్కువగా కావడంతో తలుపులు తెరుచుకొని వీధిలోకి దూసుకొచ్చాడు. భయాందోళనతో మిద్దిపైకి వెళ్లి వెనుక వైపు కిందకు దూకాడు. దీనిని ఎవరూ గమనించలేదు. స్థానికులు తలుపులు బద్ధలుకొడి ఇంట్లో ఉన్న మహిళను కాపాడారు.  గుర్రన్న కోసం వెతకగా బలమైన గాయాలతో కిందపడి ఉన్నాడు. 108కు ఫోన చేసినా సమయానికి రాకపోవడంతో బాధితులను ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుర్రన్న మృతి చెందాడు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు