ఇరుక్కుపోయాడు..

4 Jun, 2019 12:54 IST|Sakshi
ప్రమాద స్థలంలో సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రభుదాస్‌

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్‌

త్రుటిలో తప్పిన ప్రమాదం

ఒకరికి గాయాలు

లారీ వదిలి డ్రైవర్‌ పరారీ

కేసు నమోదు చేసిన పోలీసులు

సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్‌): త్రుటిలో ప్రమాదం తప్పింది.. నగరాని చెందిన ఓ కుటుంబం దైవదర్శనానికి వెళ్లింది. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా టిప్పర్‌ ఒకసారిగా దూసుకొచ్చింది. కొద్దిలో తప్పంచుకోగా వాహనచోదకులు గాయపడ్డాడు. వివరాలు.. ప్రైజర్‌పేటకు చెందిన చిట్లా జార్జి ప్రభుదాస్‌ భార్య, నాలుగేళ్ల కుమారుడితో ఆదివారం గుణదల చర్చి వద్ద నిద్ర చేశాడు. తిరిగి వేకువజామున 5గంటల సమయంలో ప్రభుదాస్‌ కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో బీఆర్టీఎస్‌ రోడ్డు మీదుగా పెజ్జోనిపేటకు సమీపంలోని ఎర్రకట్టకు చేరాడు. అదే సమయంలో కంకర రాయిని తరలిస్తున్న భారీ లారీ చిట్టినగర్‌ మీదుగా అదే సెంటర్‌కు వస్తోంది. ఎర్రకట్ట దిగువున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి మరో వైపు వెళ్తున్న ప్రభుదాస్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భార్య, కుమారుడు పక్కకు పడిపోగా, ప్రభుదాస్‌ వాహనం లారీ కిందకు వెళ్లిపోయింది. కాలు ఇరక్కపోయింది. దీంతో లారీ డ్రైవర్‌ బ్రేక్‌ వేసి లారీని నిలిపి పరారయ్యాడు. లారీ వెనక్కి తీసేవారు లేక, ప్రభుదాసును బయటకు తీసేవారు రాక గంటన్నర సమయం లారీ కిందే ఉన్నాడు. అప్పటికే ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ సీఐ దుర్గారావు క్రేన్, జేసీబీలను రప్పించి వాటి సాయంతో లారీ ముందు చక్రాల్ని తొలగించి ప్రభుదాస్‌ కాలును బయటకు తీశారు. ఈ క్రమంలో తల, కాలికి గాయమైంది. సత్యనారాయణపురం సీఐ కనకారావు ఆదేశాల మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ కోటేశ్వరమ్మ 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు