సాక్షి, బంగారుపాళెం(చిత్తూరు) : ఓ శునకం రోడ్డు ప్రమాదానికి కారణమైంది. కవలల్లో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన మండలంలోని వినాయకపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు తవణంపల్లె మండలం అరగొండ పంచాయతీ ఆర్ఆర్ నగర్కు చెందిన సురేష్చౌదరికి ఇద్దరు కుమారులు (కవలలు) దిలీప్చౌదరి, దీపక్చౌదరి. ఇద్దరూ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి 11–30 సమయంలో బెంగళూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. తెల్లవారుజామున 4–30 గంటలకు బంగారుపాళెం మండలంలోని వినా యకపురం వద్దకు రాగానే కుక్క అడ్డుపడటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పింది.
కుక్కను ఢీకొని ద్విచక్రవాహనం పడిపోవడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని ప్రథమ చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కవలల్లో చిన్నవాడు దీపక్చౌదరి(23) మృతిచెందాడు. దిలీప్చౌదరి(23)ని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 23 సంవత్సరాల అన్నదమ్ముల అనుబంధాన్ని రోడ్డుప్రమాదం విడదీసిందంటూ దిలీప్చౌదరి తమ్ముని మరణాన్ని తలచుకుని కన్నీరుమున్నీరై విలపించాడు. మృతుని తల్లిదండ్రులు, కుటుం బసభ్యులు, బం«ధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణం శోకసంద్రమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.