అరబ్‌షేక్‌కు గృహిణిని విక్రయించిన దళారీ

2 Mar, 2020 03:27 IST|Sakshi

పాతబస్తీలో ఘటన 

పాస్‌పోర్టు వదిలి పారిపోయిన షేక్‌

చాంద్రాయణగుట్ట: అరబ్‌ షేక్‌ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దళారీలను అడ్డుపెట్టుకుని పేద మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్‌పేటకు చెందిన వివాహిత ఫాతిమా ఉన్నీసాకు బార్కాస్‌ కొత్తపేట నబీల్‌ కాలనీలో ఇల్లు ఉంది. ఆర్థిక అవసరాల నిమిత్తం ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్న ఫాతిమా ఉన్నీసా దళారీ మహ్మద్‌ సాబెర్‌ అలియాస్‌ వోల్టా సాబెర్‌ను చెప్పింది. ఇల్లు కొనేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని సాబెర్‌ ఫిబ్రవరి 25న ఫాతిమాకు ఫోన్‌ చేశాడు. ఇల్లు చూపించేందుకని ఆమె తన చెల్లెలు వివాహిత రఫత్‌ ఉన్నీసా(25)తో కలిసి వెళ్లింది.

అక్కడికి వెళ్లగానే ముందస్తు పథకంలో భాగంగా అక్కడకు వచ్చిన అరబ్‌ షేక్‌ ఇబ్రహీం షుక్రుల్లా (60) ఫాతిమాను పెళ్లి చేసుకుంటా నని అడిగాడు. దానికామె అంగీకరించకపోవటంతో ఆమె చెల్లి రఫత్‌ను కూడా అడిగాడు.  ఆమె కూడా తిరస్కరించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. సాబె ర్‌ అనే దళారి రంగంలోకి దిగి, రఫత్‌ను విక్రయిస్తామని షేక్‌ దగ్గరనుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంతో సాబెర్‌ తన భార్య సమీనా ద్వారా రఫత్‌ను తన ఇంటికి వచ్చేలా ఒప్పించాడు. ఆమె రాగానే, నేరుగా షేక్‌ వద్దకు తీసుకెళ్లి ఇంట్లోకి నెట్టి బయటికి వచ్చేశారు.

అప్పట్నుంచి ఆ షేక్‌ ఆమె పట్ల క్రూరంగా లైంగిక దాడికి దిగాడు. సిగరెట్లతో కాల్చుతూ చిత్ర హింసలకు గురి చేశాడు. తన చెల్లెలు జాడ కోసం ఫాతిమా దళారీ సాబెర్‌ను గట్టిగా అడగడంతో అసలు విషయం వెల్లడించాడు. ఆ చిరునామాకు వెళ్లేసరికి షేక్‌ తన పాస్‌పోర్టును వదిలి పారిపోయాడు. ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు