Israel Hamas War Impact On India: మనవాళ్ళకి ఎందుకంత ఆందోళన?

28 Oct, 2023 00:14 IST|Sakshi

విశ్లేషణ

ప్రస్తుతం ఇజ్రాయెల్‌– పాలస్తీనియన్ల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం స్వయం ప్రకటిత మేధావులమని చెప్పుకునే మనదేశంలోని కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రింట్‌ మీడియాలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో ఒకటే గోల! హమాస్‌ చర్యలను ప్రామాణీకరిస్తూ సంఘీభావ ర్యాలీలు తీయడం, హమాస్‌ దాడుల తరహాలో భారతదేశంలో కూడా దాడులు చేయాలంటూ దేశ సమగ్రతకు సవాలు విసిరే విధంగా వీడియోల పోస్టింగులు!! 

భారతదేశం భద్రతను దృష్టిలో ఉంచుకున్న భారత ప్రభుత్వం హమాస్‌ తీవ్రవాద చర్యలను నిర్ద్వంద్వంగా ఖండించింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన సంఘీభావాన్ని కూడా ప్రకటించింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా బలి అవుతున్న సామాన్య ప్రజల మృత్యు ఘోషకు తీవ్ర సంతాపం కూడా తెలియజేసింది. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా అందిస్తోంది. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న జిహాదీ ఉగ్రవాదాన్నీ, రక్షణ పరంగా ఇజ్రాయెల్‌కు మనకు ఉండే ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని, మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశ హితాన్ని కోరే వాళ్ళందరూ స్వాగతించారు. కానీ కొందరు వ్యతి రేకిస్తున్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ హమాస్‌ చర్యలను సమర్థిస్తోంది. దీని వెనుక ఈ దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించే ప్రయోజనం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే 1948కు ముందు ఇజ్రాయెల్‌ అనే పేరుతో ఒక భూ భాగమే లేదనేది అక్షర సత్యం. 1947 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ప్రపంచ పటంలో లేవు అనేది కూడా సత్యమే కదా? వాటి మునుగడను భారతదేశం కాదంటుందా? ఇజ్రాయెల్‌ మను గడను ప్రశ్నించే వారికి ఈ సమాధానం సరిపోదా? పెట్టుబడిదారీ పశ్చిమ దేశాలు మధ్య ఆసియాలో తమ రాజకీయ అవసరాల కోసమే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్‌ దేశాల మధ్యలో ఇజ్రాయెల్‌ ను సృష్టించాయి.

‘జెరూసలేం’ ప్రాంతం తమ ఆధ్యాత్మిక, మత, సాంస్కృతిక భావాలకు కేంద్రం అని రెండువేల ఏళ్లుగా యూదు జాతీయులు చెప్పుకొంటు న్నారు. యూదులపై దయతో పశ్చిమ దేశాలు వారికి ఒక భూభాగాన్ని కేటాయించాయని చెప్తే సత్య దూరమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ దేశాలు 60 లక్షల
మంది యూదులను నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా మట్టుబెట్టాయనేది చరిత్ర చెప్పే చెరపలేని సాక్ష్యం. ఇక పాలస్తీనా ఒక స్వతంత్ర భూభా గమనీ, దానిని దురహంకార పూరితమైన ఇజ్రాయెల్‌ దేశం ఆక్రమించిందనీ మన దేశంలోని  చారిత్రిక పరిజ్ఞానం లేని కొంతమంది మూర్ఖపు వాదనలు చేస్తూ, దేశ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.

ప్రస్తుతం పాలస్తీనా భూభాగాలుగా చెప్పుకొనే గాజా స్ట్రిప్, వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతాలు 1967 వరకు వరుసగా ఈజిప్టు, జోర్డాన్‌ దేశాలలో భాగాలు. జోర్డాన్‌ నదికి పడమర వైపున ఉండే ప్రాంతాన్ని వెస్ట్‌ బ్యాంక్‌ అని పిలుస్తున్నారనేది గమనార్హం. ఇస్లాం మతస్థులకు ‘జెరూసలేం’ పవిత్ర స్థలం కూడా. అందుకే ఇజ్రాయెల్‌ ఏర్పాటును ముస్లిం దేశాలన్నీ వ్యతిరేకించాయి. ఇక క్రైస్తవులకు ‘జెరూసలేం’, ‘బెత్లె హేము’ పవిత్ర స్థలాలు. క్రైస్తవుల ప్రాబల్యం నిలుపుకోవాలంటే అక్కడ పశ్చిమ దేశాలకు తమకు అనుకూలమైన దేశం ఒకటి ఉండాలి.

ఇజ్రాయెల్‌ ఏర్పాటు వెనుక ఉన్న సూత్రం ఇదే! అరబ్‌ – ఇజ్రాయెల్‌ ఐదు యుద్ధాల్లో ముస్లిం దేశాలను ఇజ్రాయెల్‌  మట్టి కరిపించడం వెనక దాగి ఉన్న రహస్యం కూడా ఇదే! పశ్చిమ దేశాలన్నీ కూడా ఇజ్రాయెలీలకు ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తున్నాయనేది వాస్తవం.  ఇక హమాస్‌ చర్యలు పాలస్తీనియన్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి వేస్తాయనేది కాదనలేని సత్యం. గాజా స్ట్రిప్‌లోని ఇంటర్నల్‌ బంకర్లను ధ్వంసం చేసేంతవరకూ ఇజ్రాయెల్‌ ఆగదు. ఇదే జరిగితే అనేకమంది సామాన్య ప్రజలు బలి అవుతారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై దృష్టిని సారించి, హమాస్‌ తీవ్రవాదుల చెరలో బందీ లుగా ఉన్న యూదులను విడిపించే ఏర్పాట్లు చేయాలి. అదే విధంగా ఇజ్రాయెల్‌ దుందు డుకు చర్యలకు అడ్డుకట్ట కూడా వేయాలి.
- వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు 

మరిన్ని వార్తలు