చాంద్రాయణగుట్టకు 45 ఏళ్లుగా ఇద్దరే..

10 Nov, 2023 03:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అక్కడ ఇప్పటివరకు ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలుగా గెలిచారు.. అలా అని అదేం కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమేమీ కాదు.. ఏకంగా పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కొక్కరు వరుసగా అయిదుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అదెక్కడో కాదు..పాతబస్తీలోని  చాంద్రాయణగుట్టలో. ఒకరేమో అమానుల్లాఖాన్‌ కాగా మరొకరు అక్బరుద్దీన్‌ ఒవైసీ.

అమానుల్లాఖాన్‌ ప్రస్థానం ఇలా 
1978 ఎన్నికలకు ముందు చాంద్రాయణగుట్ట నియోజక వర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అమానుల్లాఖాన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బాలయ్యపై 1,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  
 1983లో ఎ.నరేంద్ర(బీజేపీ)పై 3,581 ఓట్లతో,   1985లో 3,009 ఓట్ల మెజారిటీతో గెలిచారు.  
 1989 ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 28,147 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  
1994 ఎన్నికల నాటికి సలావుద్దీన్‌ ఒవైసీతో విభేదించి మజ్లిస్‌కు పోటీగా అమానుల్లాఖాన్‌ ఎంబీటీ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎంబీటీ తరఫున పోటీచేసి ఎంఐఎం అభ్యర్థిపై 35,210 ఓట్లతో గెలిచారు. 

అక్బరుద్దీన్‌ ఒవైసీ ఎంట్రీతో... 
♦ అమానుల్లాఖాన్‌  వరుస విజయాలకు అడ్డుకట్ట వేసేలా సలావుద్దీన్‌ ఒవైసీ తన చిన్న కుమారుడు అక్బరుద్దీన్‌ ఒవైసీని 1999 ఎన్నికల్లో పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో 11,920 ఓట్ల మెజారిటీతో అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు. 
 2004 ఎన్నికల్లో 11,949 ఓట్ల మెజా రిటీతో గెలిచారు.  ఆ తర్వాత 2009 ఎన్నికల్లో 15,177 ఓట్లతో, 2014లో 59,279 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు.  మోగించారు.     2018 ఎన్నికల్లో అక్బరుద్దీన్‌  ఒవైసీ భాజపా అభ్యర్థి షెహాజాదీ సయ్యద్‌పై 80,264 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. వరుసగా అయిదు సార్లు గెలిచి అమానుల్లాఖాన్‌ రికార్డును సమం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అక్బర్‌ చాంద్రాయణగుట్ల నుంచే పోటీ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు