నటిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు..!

14 Jan, 2018 09:08 IST|Sakshi

సాక్షి, ‍చెన్నై: నటి శ్రుతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశీయులనే కాదు, విదేశీ తమిళులను ఈమె తన బుట్టలో పడేసుకుని డబ్బును లక్షల్లో గుంజేసింది. పోలీసుల విచారణలో పలువురు శ్రుతి బాధితుల చిట్టా బయట పడుతోంది. కోవై జిల్లా పాపనాయగన్‌ పాళయంకు చెందిన నటి శ్రుతి ప్రేమ,పెళ్లి పేరుతో పలువురు యువకులను తన మాయలో పడేసి వారి నుంచి లక్షల్లో డబ్బును లాగి ఆడంబర జీవితాన్ని అనుభవిస్తూ ఆమె గుట్టురట్టవ్వడంతో ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్కపెడుతున్న విషయం తెలిసిందే.  8 మంది శ్రుతి ప్రేమ బాధితుల ఫిర్యాదుతో ఆమెను కోవై పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

భయంతో భాగోతం బయటపెట్టలేదు..
ఇప్పటి వరకూ గౌరవ మర్యాదలు, ఎవరూ తమకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రారన్న భయంతో శ్రుతి భాగోతాన్ని బయట పెట్టడానికి ముందుకురాని ఆమె బాధితులు పలువురు ఇప్పుడు పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. మరి కొందరిని పోలీసులు శ్రుతి సెల్‌ఫోన్‌ ఆధారంగా గుర్తించి విచారించడానికి సిద్ధం అవుతున్నారు. నటి శ్రుతి మోజులో పడి లక్షలు పోగొట్టుకున్న ఒక యువకుడు పేర్కొంటూ  తాను వివాహానికి వధువు కోసం ఇంటర్నెట్‌లో వివరాలను పొందుపరిచానన్నాడు. అవి చూసి శ్రుతి తనకు ఫోన్‌ చేసి పరిచయం పెంచుకుందన్నాడు. ఆ తరువాత పరిచయం స్నేహంగా మారి పెళ్లి చేసుకుందామని చెప్పిందని తెలిపాడు. ఆ తరువాత కుటుంబ ఖర్చులు. వైద్య ఖర్చులు అంటూ పలుమార్లు లక్షల్లో డబ్బు గుంజిందని చెప్పాడు. 

మోసగత్తె అని తెలిసింది..
దీంతో ఆమెపై అనుమానం కలగడంతో తను ఫోన్‌ను పరిశీలించగా తనో మోసగత్తె అని తెలిసిందని తెలిపాడు. శ్రుతి గురించిన వివరాలు తనకు తెలిసిన విషయం తను గ్రహించి తనకు దూరం అయ్యిందని చెప్పాడు. అలా తన అందంతో పలువురిని శ్రుతి మోసం చేసిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రుతి అందాల మోజులో పడి మోసపోయిన వారిలో అమెరికాలో నివశిస్తున్న కోవైకి చెందిన ఇంజినీర్‌ ఒకతను ఉన్నాడు. అతనికి పెళ్లి ఆశ పెట్టి రూ.15 లక్షలను శ్రుతి స్వాహా చేసిందట. అతనిప్పుడు కోవైలోని తన అన్నయ్య ద్వారా కోవై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అంతే కాదు మరో ఇద్దరు ఇంజినీర్‌ యువకులు కూడా శ్రుతి అందమైన మోసానికి గురైయ్యారట. అలాంటి వారందరిని పోలీసులు విచారించడానికి సిద్ధం అవుతున్నారు.
 

మరిన్ని వార్తలు