ఏఓబీ టు సంగారెడ్డి

23 Jul, 2018 13:03 IST|Sakshi
పోలీసుల అదుపులో గంజాయి తరలిస్తున్న నిందితులు(ఫైల్‌) 

సంగారెడ్డి క్రైం : ఎక్సైజ్‌ పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నా నారాయణఖేడ్, జహీరాబాద్‌ ప్రాంతాల్లో గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట కిలోల కొద్ది గంజాయి పట్టుపడుతూనే ఉంది. దొరికేదే ఇంత ఉంటే ఎక్సైజ్‌ శాఖ కళ్లుగప్పి చేతులు సరిహద్ధులు దాటుతున్న గంజాయి ఇంక ఎంత ఉంటుందనే ప్రశ్న అధికారులను కలవరపెడుతోంది. 

ఒకప్పుడు సాగుకు, నేడు వ్యాపారానికి..
గంజాయి సాగుకు ఒకప్పుడు నారాయణఖేడ్, జహీరాబాద్‌ ప్రాంతాలు రాష్ట్రంలోనే పేరుగాంచాయి. ప్రస్తుతం సాగు తగ్గినా వ్యాపారం మాత్రం నాటి కంటే జోరుగా సాగుతోంది. ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతాల్లో పండించిన మేలు రకమైన గంజాయిని కొందరు వ్యాపారులు వైజగ్‌ మీదుగా అనేక చెక్‌ పోస్టులు, సరిహద్దులు దాటించి జహీరాబాద్, నారాయణఖేడ్‌ ప్రాంతాలకు చేరుస్తున్నారు. గతంలో ఇక్కడి గంజాయి సాగు చేసిన రైతులు ఎక్సైజ్‌శాఖ చేపట్టిన సంస్కరణలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రత్యామ్నాయ ఉపాధిని ఎంచుకున్నారు. కాని అప్పుడు దళారులుగా వ్యవహరించిన వారు మాత్రం నేడు వ్యాపారులుగా మారి గంజాయి దందాను మూడు, పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  

ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో రవాణ..
ప్రైవేటు వాహనాల్లో వస్తే చెక్‌ పోస్టుల దగ్గర తనిఖీల్లో దొరికిపోతామన్న భయంతో సాధారణ ప్రయాణికుల మాదిరిగానే ఆర్టీసీ బస్సుల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఈ పనికి ఆర్థిక అవసరాలు ఉన్న నిరుద్యోగులకు డబ్బు ఆశ చూపి వాడుకుంటున్నారు. ఎక్సైజ్‌ సిబ్బందికి చిక్కినప్పుడు రవాణా చేసే వారు బలి అవుతున్నారు. అసలు వ్యాపారులు తప్పించుకుంటున్నారు. 

ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు..
ఇతర రాష్ట్రాల నుంచి జహీరాబాద్, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో గంజాయి దిగుమతి చేసుకుంటున్న అధికారులు అదను చూసుకుని ఇక్కడి నుంచి మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో పండించిన గంజాయికి విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ వద్దే 

పట్టుబడిన గంజాయి..
ఇటీవల అధికారులు నిర్వహించిన దాడుల్లో సంగారెడ్డి పట్టణంలో ఎక్సైజ్‌శాఖలో పని చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌తో పాటు నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన మరో ముగ్గురి వద్ద 45 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు విలువ రూ.72 వేలు ఉంటుంది. సదరు కానిస్టేబుల్‌ నారాయణఖేడ్‌ ప్రాంతంలో పనిచేసిన సమయంలో గంజాయి దందాపై పట్టు పెంచుకుని, లాభాల ఆశతో స్వయంగా వ్యాపారంలోకి దిగినట్లు సమాచారం. అక్రమ రవాణా అరికట్టాల్సిన వారే ఇలా దందాలు చేస్తుండడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

పక్కా నిఘాతో దాడులు...
జిల్లాలో గంజాయి రవాణా, వ్యాపారంపై ఎక్సైజ్‌శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో రవాణా అరికట్టడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు గంజాయి వాడకం వలన కలిగే నష్టాలు, చట్టరిత్య తీసుకునే చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం.  గంజాయి అక్రమ రవాణా గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించాలి. 
 –చంద్రయ్య, ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు