ప్రియుడి వంచన.. వివాహిత ఆత్మహత్యాయత్నం

31 Dec, 2019 12:38 IST|Sakshi
చికిత్స పొందుతున్న శాంతమ్మ

పెళ్లయిన 10 రోజులకే భర్త నుంచి విడిపోయి ప్రియుడి చెంతకు

అతను మోసం చేయటంతో మనస్తాపం

కర్నూలు, బొమ్మలసత్రం: భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కానాలకు చెందిన సుబ్బ లక్ష్మమ్మ కూతురు శాంతమ్మ, అదే గ్రామానికి చెందిన రాజేష్‌ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి శాంతమ్మను ఓ వ్యక్తికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లైన 10 రోజులకే తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు భర్తకు చెప్పడంతో అతడు విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి విడిపోయారు. దీంతో శాంతమ్మ భర్తను వదిలి ప్రియుడి రాజేష్‌ వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలో రెండు సార్లు అబార్షన్‌ చేయించాడు. తనను వివాహం చేసుకోవాలని పలుమార్లు కోరినా అప్పుడు ఇప్పుడూ అంటూ దాట వేస్తూ వచ్చాడు. వారం క్రితం పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో పుట్టినింటికి చేరుకుంది. తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం ఉదయం మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో పడివుండగా తల్లి గుర్తించి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎలాగైనా తన బిడ్డకు న్యాయం చేయాలని శాంతమ్మ తల్లి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

మరిన్ని వార్తలు