మృగాళ్లు

6 Jan, 2020 08:57 IST|Sakshi

వీడియో తీసి వేధింపులు  

లవ్‌ జిహాద్‌ అని ఎంపీ శోభా ధ్వజం   

సీఎంకు, నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు  

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌  

బనశంకరి: కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న లవ్‌ జిహాద్‌ తతంగం మళ్లీ తెరమీదకు వచ్చింది. బెంగళూరులో వ్యాపారం నిర్వహిస్తున్న కేరళ రాష్ట్రం కాసరగూడుకు చెందిన యువకుడు ఒక మైనర్‌ బాలికను నమ్మించి అత్యాచారానికి పాల్పడి, మతం మారాలని ఒత్తిడి తెస్తున్నాడని, తక్షణం అతడిని అరెస్ట్‌ చేయాలని బీజేపీ నాయకురాలు, చిక్కమగళూరు ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆమె బాలిక కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి యడియూరప్పను కలిశారు. అనంతరంబెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.  

కఠినంగా వ్యవహరించాలన్నారు  
బాధితురాలి కుటుంబం తనను సంప్రదించగా, ఆదివారం కలిశానని, వీరిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లానని శోబా కరంద్లాజే తెలిపారు. ముఖ్యమంత్రి కూడా పోలీస్‌ అధికారులకు కఠినంగా వ్యవహరించాలని  ఆదేశించారన్నారు. బెంగళూరులో ఘటన చోటుచేసుకోవడంతో బాలిక ఎలక్ట్రానిక్‌సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దుండగులపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  బెంగళూరు పోలీసులు బాధితురాలి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు'

వీడియో తీసి బెదిరింపులు 
ఎంపీ శోభా మాట్లాడుతూ.. 17 ఏళ్ల బాలిక బెంగళూరులో కాలేజీలో చదువుతున్న సమయంలో పరిచయం చేసుకున్న రిషబ్, మసూద్‌ అనే ఇద్దరు యువకులు ఆమెను మంగళూరు, బెంగళూరులో తిప్పి మత్తు మందులిచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. అత్యాచార దృశ్యాలను వీడియో తీసి బాలికను బెదిరించారు. బాలిక తండ్రి మినహా మొత్తం కుటుంబసభ్యులు మతం మారాలని, లేకపోతే వీడియో బహిరంగ పరుస్తామని, ఇంటికి నిప్పు పెట్టి హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ యువకులు ఎలక్ట్రానిక్‌ సిటీలో అక్వేరియం వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాలిక తెలిపిన ప్రకారం గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నారు. వీరు నిత్యం గంజాయి మత్తులో ఉంటారు. వీరు ఇంకా ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారు, మంగళూరు, బెంగళూరులో ఇలాంటి కేసుల్లో భాగస్వాములుగా ఉన్నారా అనే దానిపై లోతుగా విచారణ చేపట్టాలి అని శోభా డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు