కుమారుడితో సహా మహిళ అదృశ్యం

11 Jul, 2019 09:05 IST|Sakshi
నీరజ, కుమారుడు శైలేంద్ర (ఫైల్‌)  

సాక్షి, ఆరిలోవ (విశాఖపట్టణం) : తల్లీ కుమారుడు అదృశ్యమైన కేసు ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌లో గాలి రామకృష్ణ భార్య నీరజ, ఆరేళ్ల కుమారుడు శైలేంద్ర ఓ అద్దింట్లో నివాసముంటున్నారు. రామకృష్ణ ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన నెలలో ఒక వారం కంపెనీ వ్యవహారాల కోసం హైదరాబాద్‌ వెళ్తుంటారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌ బయలుదేరారు. రాజమండ్రి వెళ్లిన అనంతరం తన బార్య నీరజకు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. దీంతో తన మామకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. ఆయన కూడా ఆమె ఫోన్‌కు ప్రయత్నించినా అదే పరిస్థితి.

దీంతో రవీంద్రనగర్‌లోని బంధువులకు తెలియజేశారు. బంధువులు ఆమె ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. ఆమె తన కుమారుడితో పుస్తకాలు బ్యాగు పట్టుకొని సాయంత్రం బయటకు వెళ్లిందని ఇంటి యజమాని ద్వారా తెలుసుకొన్నారు. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో మార్గమధ్యలో రామకృష్ణ ట్రైన్‌ దిగిపోయి తిరిగి అదే రాత్రి 3 గంటలకు విశాఖ చేరుకొన్నారు. నీరజ నెల రోజులుగా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు నేర్చుకొంటుంది. అప్పటి నుంచి ఆ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకురాలు కల్పనతో తరుచూ ఫోన్‌లో చాటింగ్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి ఆరా తీయగా అక్కడ కల్పన కూడా లేదు. దీంతో రామకృష్ణ తన భార్య, కుమారుడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్పన గురించి కూడా ఆరా తీయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు