ప్రియురాలు దక్కదేమోనని ప్రియుడి ఆత్మహత్య

11 Jul, 2019 09:09 IST|Sakshi
ఉరికి వేలాడుతున్న దినేష్‌ మృతదేహం

సాక్షి, తెనాలి: ప్రియురాలు తనకు దక్కదేమోనన్న ఆందోళనతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఐతానగర్‌ లంకదిబ్బకు చెందిన చేబ్రోలు దినేష్‌కుమార్‌(24) డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి, పెయింట్‌ పనులకు వెళుతున్నాడు.

పాండురంగపేటకు చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. దినేష్‌ మరో యువతితో చాటింగ్‌ చేస్తున్నాడంటూ ఇటీవల ఆ యువతి ప్రశ్నించడంతో గత వారం రోజులుగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ప్రియురాలు తనకు దక్కదని ఆందోళన చెందిన దినేష్‌ తెనాలి మండలం తేలప్రోలు పరిధిలోని పొలం వెంబడి చెట్టుకు మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు మృతదేహం వేలాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని రూరల్‌ పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే దినేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా  తెలుస్తోందని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు తెలిపారు.  

మరిన్ని వార్తలు