తల్లీకుమార్తె దారుణ హత్య

1 May, 2019 10:14 IST|Sakshi
తల్లి కవితా, కుమార్తె జగశ్రీ(ఫైల్‌)

 కొడగుజిల్లా సోమవారపేటె వద్ద ఘోరం

కర్ణాటక, బనశంకరి: తల్లీకుమార్తె హత్యకు గురైన ఘటన కొడగు జిల్లా సోమవారపేటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కొడగు జిల్లా సోమవారపేటే దొడ్డమళ్తే గ్రామానికి చెందిన దివంగత వీరరాజు సతీమణి కవితా(45), ఆమె కుమార్తె జగశ్రీ(17)లు మంగళవారం ఉదయం  తోటపనులకు వెళ్లారు. మధ్యాహ్నమైనా ఇంటికి రాకవడంతో కుమారుడు మేఘవర్దన్‌రాజ్‌ ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ అని వచ్చింది.

దీంతో  మేఘవర్దన్‌రాజ్‌ తోట వద్దకు వెళ్లగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలపై ఉన్న బలమైన గాయాలను పరిశీలించగా దుండగులు మరణాయుధాలతో దాడిచేసి హత్య చేసినట్లు తేలింది జిల్లా ఎస్పీ సుమన్‌ డీ.పన్నేకర్, సోమవారపేటే డీఎస్‌పీ దినకర్‌శెట్టి, ఎస్‌ఐ నంజుండేగౌడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగీలాన్ని రప్పించి హంతకుల ఆనవాళ్ల కోసం ప్రయత్నించారు. నిపుణులు దుండగుల వేలిముద్రలు సేకరించారు.  అనంతరం మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం కొడగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతురాలు కవితా కుటుంబానికి, అదే గ్రామంలోని కొందరితో భూతగాదాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై గతంలో కూడా గొడవలు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. మృతురాలు జగశ్రీ హసన్‌ సెయింట్‌ పెలోమినా కాలేజీలో ద్వితీయ పీయూసీ చదువుతోంది. సెలవులు కావడంతో ఊరికి వచ్చి తల్లితో సహా హత్యకు గురైంది.  కుమారుడు మేఘవర్ధన్‌రాజ్‌ విరాజపేటే మొరార్జీదేశాయ్‌ స్కూల్‌ 8 వ తరగతి చదువుతూ హస్టల్‌లో ఉంటున్నారు.   

>
మరిన్ని వార్తలు