ఓటీపీ ఉంటేనే..!

1 Nov, 2017 07:38 IST|Sakshi

ప్రతి లావాదేవీకీ ఓటీపీ వర్తింపజేయాలి

సైబర్‌ నేరగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు

ఆర్బీఐకి ప్రతిపాదించనున్న పోలీసులు

త్రైమాసిక సమావేశంలో సమగ్ర నివేదిక?

సాక్షి, సిటీబ్యూరో: ఓ యువకుడి నుంచి అమెరికాలో రూ.4 లక్షల జీతం వచ్చే   ఉద్యోగమంటూ రూ.86 లక్షలు గుంజారు...
 ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరుతో నగరానికి చెందిన జయరాజ్‌ నుంచి రూ.11 లక్షలు కాజేశారు...
సికింద్రాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌తో విత్తుల సరఫరా వ్యాపారమంటూ నేరగాళ్లు రూ.8.5 లక్షలు స్వాహా చేశారు..
వడ్డీ లేని రుణం పేరుతో నారాయణగూడకు చెందిన ఫారూఖ్‌ను రూ.62 లక్షలు ముంచారు...
రూ.3.6 కోట్ల లాటరీ పేరుతో బంజారాహిల్స్‌ వాసి ఫిరోజ్‌ ఖాన్‌ నుంచి రూ.22 లక్షలు కాజేశారు...
తమ ఆస్తిని ఇస్తామంటూ ఫేస్‌బుక్‌ ద్వారా ఎర వేసి ఓ వ్యక్తి నుంచి రూ.76 లక్షలు దండుకున్నారు...

ఇటీవల కాలంలో నగర వాసుల నుంచి సైబర్‌ నేరగాళ్లు వివిధ పేర్లతో కాజేసిన మొత్తాలివి. ఈ పంథాలో రెచ్చిపోతున్న క్రిమినల్స్‌ను కట్టడి చేసేందుకు బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనల అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వీటిలో ప్రతి లావాదేవీకి వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ఏర్పాటు కీలకమని అభిప్రాయపడుతున్నవారు ఇదే విషయాన్ని త్వరలో జరుగనున్న సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. 

బ్యాంకు ఖాతాలే కీలకం...
ఈ తరహా మోసాలను నైజీరియా, సోమాలియా తదితర దేశాల నుంచి వచ్చి మెట్రో నగరాల్లో స్థిరపడిన నల్లజాతీయులే ఎక్కువగా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌ కాల్, ఎస్సెమ్మెస్, ఈ–మెయిల్‌ ద్వారా ఎర వేస్తున్న ఈ సైబర్‌ నేరగాళ్లు బాధితుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అయితే వీరు అత్యంత అరుదైన సందర్భాలు మినహాయిస్తే బాధితులను నేరుగా కలవరు. కేవలం తమ మాటలు, తప్పుడు పత్రాలతో ఎర వేసి ఎదుటి వారిని పూర్తిగా తమ ముగ్గులోకి దింపుతారు. ఆపై వివిధ రకాలైన పన్నులు తదితరాల పేర్లు చెప్పి వారి నుంచి నగదును డిపాజిట్, ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంటారు. ఇందుకు వీరికి బ్యాంకు ఖాతాలు అత్యంత కీలకం. అయితే పోలీసులకు చిక్కే, బ్యాంకు సిబ్బంది అనుమానించే అవకాశం ఉండటంతో వీరు ఎప్పుడూ తమ బ్యాంకు ఖాతాలను నేరాలు చేయడానికి వినియోగించరు.  

‘మనీమ్యూల్స్‌’ను ఏర్పాటు చేసుకుని...
ఈ బ్యాంకు ఖాతాల కోసం సైబర్‌ నేరగాళ్లు మనీమ్యూల్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు. నేరాలకు సంబంధించిన డబ్బు డిపాజిట్‌ చేసుకోవడానికి అవసరమైన బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ ఖాతాల్లో పడిన సొమ్మును డ్రా చేసి నేరగాళ్లుకు ఇవ్వడమో, డెబిట్‌ కార్డు వంటివి అందించడమే చేసే వారికి సాంకేతికంగా మనీమ్యూల్స్‌ అంటారు. ఇలా సహకరించినందుకు వీరికి సైబర్‌ నేరగాళ్లు కొంత కమీషన్‌ చెల్లిస్తుంటారు. ఈ మనీమ్యూల్స్‌లో అత్యధికులు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. ఆయా మెట్రో నగరాల్లో నివసించినప్పుడు వారిని మనీమ్యూల్స్‌గా మారుస్తున్న నైజీరియన్లు ఆ తర్వాత వారి ఖాతాలను వాడుకుంటున్నారు. ఇలాంటి మనీమ్యూల్స్‌లో కొందరికి ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లతో సంబంధాలు ఉండట్లేదు.  

ఓటీపీ పక్కా చేస్తే...
బాధితుల ద్వారా మనీమ్యూల్స్‌కు చెందిన ఖాతాల్లో పడిన డబ్బును వారి నుంచి సేకరించిన డెబిట్‌కార్డు ద్వారా సైబర్‌ నేరగాళ్ళు డ్రా చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ కార్యకలాపాల మాదిరిగా ఏటీఎంలో డ్రా చేయడానికి ఓటీపీ ఏర్పాటు చేస్తే ఇలాంటి వారిని కట్టడి చేసే ఆస్కారం ఉంటుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు. ఖాతాలో పడిన డబ్బు డ్రా చేయాలంటూ ఓటీపీ తప్పనిసరి అయితే అప్పటికే వాడుతున్న మనీమ్యూల్స్‌ ఖాతాలు సైబర్‌ నేరగాళ్ళకు అక్కరకు రాకుండా పోతాయని పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు నేరగాళ్లు డబ్బు డ్రా చేయడానికి అవసరమైన ఓటీపీ కోసం ఖాతాదారులను సంప్రదిస్తే ఆ ఆధారాలను బట్టి వారిని పట్టుకోవడం  సాధ్యమవుతుందని భావిస్తున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకేజ్‌తో పాటు ప్రతి లావాదేవీకీ ఓటీపీని సైతం పక్కా చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్బీఐ అధికారులతో జరిగే త్రైమాసిక సమావేశంలో దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనలు చేయాలని యోచిస్తున్నారు.

మరిన్ని వార్తలు