ఆస్పత్రి నిర్వాకం; కిడ్నీ చోరీ కలకలం!?

5 Mar, 2019 19:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : మలక్‌పేటలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ రోగి కడుపులో ఉన్న గడ్డతో పాటు కిడ్నీ తొలగించడంతో కలకలం రేగింది. వివరాలు.... హయత్‌నగర్‌కు చెందిన శివ ప్రసాద్‌(29) అనే వ్యక్తి కడుపులో గడ్డ ఉందని వారం రోజుల క్రితం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో అతడి నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసిన ఆస్పత్రి వర్గాలు నిన్న(సోమవారం) గడ్డను తొలగించామని పేర్కొన్నాయి. అయితే గడ్డతో పాటు శివ ప్రసాద్‌ కిడ్నీ కూడా తొలగించామంటూ మంగళవారం వైద్యులు చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

ఈ క్రమంలో ఎవరికీ చెప్పకుండా అసలు ఇలా ఎందుకు చేశారంటూ శివ ప్రసాద్‌ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. శివ ప్రసాద్‌ కిడ్నీ చోరీ చేశారంటూ నిరసన చేపట్టారు. కాగా శివ ప్రసాద్‌ శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ సోకినందు వల్లే కిడ్నీ తొలగించామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శివప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు