మద్యానికి బానిసైన తమ్ముడిని దారుణంగా..

18 Jan, 2020 08:29 IST|Sakshi

సాక్షి, రామచంద్రాపురం(పటాన్‌చెరు): నిత్యం తాగొచ్చి డబ్బులు కావాలని వేధిస్తున్న తమ్ముడిని సొంత అన్నే హత్య చేసిన సంఘటన రామచంద్రపురం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ రమేశ్‌ కథనం ప్రకారం.. రామచంద్రపురం పట్టణంలోని బొంబాయి కాలనీలో నివాసముండే సయ్యద్‌ చిన్న కుమారుడు లతీఫ్‌(25) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన లతీఫ్‌ నిత్యం డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. బుధవారం కూడా ఎప్పటిలాగానే లతీఫ్‌ మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఉన్న ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధింపులకు గురిచేయడంతో తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు.

గురువారం తిరిగి లతీఫ్‌ గొడవ చేయడంతో అతని అన్న ఇబ్రహీం కోపంతో లతీఫ్‌పై గొడ్డలితో దాడి చేశాడు. దాంతో లతీఫ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఏం చేయాలో తోచని ఇబ్రహీం తమ్ముడి మృతదేహాన్ని భారతీనగర్‌ డివిజన్‌ పరిధిలోని మ్యాక్‌ సొసైటీ కాలనీ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మృతదేహం కొంతమేరకు కాలిపోగా కుక్కలు, పందులు మృతదేహాన్ని పీక్కు తిన్నాయి. శుక్రవారం ఆ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేవలం తల మాత్రమే ఉండటంతో బొంబాయి కాలనీవాసులు లతీఫ్‌గా గుర్తించారు. ప్రదీప్‌ సోదరుడు ఇబ్రహీంని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు