కీచక గురువుపై పోక్సో కేసు నమోదు

23 Aug, 2018 06:47 IST|Sakshi

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌ : ఏలూరు నగరానికి చెందిన ఒక మైనర్‌ బాలికను నమ్మించి లోబరుచుకుని గర్భవతిని చేసిన సంఘటనకు సంబంధించి బాలిక తల్లి ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు టూటౌన్‌ ఎస్సై కె.రామారావు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్‌ టీచర్‌గా పని చేస్తున్న కె.రాంబాబు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన కుమార్తెను బెదిరించడంతో ఈ విషయం బయటకు తెలియకుండా దాచి పెట్టిందని తెలిపారు. రెండు రోజుల క్రితం కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా గర్భవతిగా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు రాంబాబు ను బాలికకు సంబంధించిన బంధువులు, మరి కొందరు మంగళవారం రాత్రి తీవ్ర స్థాయిలో కొట్టి నగ్నంగా నగర వీధుల్లో నడిపించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడు రాంబాబును వారి నుండి విడిపించి స్టేషన్‌కు తరలించారు. రాంబాబును తీవ్రస్థాయిలో కొట్టడంతో శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్య పరీక్షల్లో తేలింది. రాంబాబు పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం గాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు