ముగ్గురు యువకుల అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
రెస్క్యూ హోంకు ఐదుగురు యువతులు
పహాడీషరీఫ్: నగర శివారులో అర్ధరాత్రి బెల్లి డ్యాన్స్ నిర్వహిస్తున్న ముగ్గురు యువకులను పహాడీషరీఫ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఐదుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు ఇన్స్పెక్టర్ ఎం.శంకర్తో కలిసి వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ వివరాలు వెల్లడించారు. జల్పల్లి గ్రామ శివారులోని మామిడితోటలో హమీద్ ఖాన్ అనే యువకుడికి ఫాం హౌజ్ ఉంది. ఈ నెల 15న అతడి పుట్టిన రోజు కావడంతో రేవ్ పార్టీకి సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా దీప శెట్టి అనే డ్యాన్సర్ను సంప్రదించి నలుగురు యువతులను తన ఇన్నోవా కారులో సికింద్రాబాద్ నుంచి ఫాం హౌస్కు రప్పించాడు. హమీద్ ఖాన్తో పాటు అతని స్నేహితులు చార్మినార్కు చెందిన రియాజ్, అత్తాపూర్కు చెందిన మహ్మద్ గౌస్, ముర్గీచౌక్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్, అఫ్జల్ యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేస్తూ.....హుక్కా పీలుస్తూ హంగామా చేశారు.
పెద్ద ఎత్తున బాక్స్లు ఏర్పాటు చేయడంతో శబ్ధం విని అటుగా వెళుతున్న పెట్రోలింగ్ ఏఎస్ఐ నంద గోపాల్, కానిస్టేబుళ్లు యాదగిరి, జంగయ్య ఫాంహౌస్లోకి ప్రవేశించారు. పోలీసుల రాకను చూసి హమీద్ ఖాన్, అఫ్జల్ పరారయ్యాడు. ఈ సందర్భంగా ఐదుగురు యువతులను తుక్కుగూడలోని ప్రజ్వల హోంకు తరలించారు. వీరిలో ముగ్గురు కోల్కతా, ఒకరు ఒరిస్సా, ఒకరు ఢిల్లీకి చెందిన వారిగా పోలీసు విచారణలో తేలింది. వీరికి ఒక్క రాత్రికి రూ.1,500 ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి ఇన్నోవా కారు, బైక్, హుక్కా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హమీద్ ఖాన్ తండ్రి విదేశాల్లో ఉండటంతో అతను ఇక్కడ ఇలా జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో అదనపు ఇన్స్పెక్టర్ మురళీ మోహన్, ఎస్సై శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.