ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్‌, ప్రియుడు ఆత్మహత్య 

13 Aug, 2019 14:29 IST|Sakshi

దళిత యువతిపై అయిదుగురు అత్యాచారం

యువతికి గర్భస్రావం

మనస్తాపంతో ఉరివేసుకున్నయువకుడు

జైపూర్‌: మహిళలు, బాలికలపై అత్యాచారం,హత్యలకు పాల్పడుతున్న వారికి ఉరిశిక్షల అమలుపై తీవ్ర చర్చ నడుస్తుండగానే రాజస్థాన్‌లో జరిగిన  మరో అమానవీయ ఘటన కలకలం రేపింది.  నిందితుల్లో నలుగురిని   ఆదివారం అరెస్టు చేయడంతో గత నెలలో జరిగిన ఈ దారుణం వెలుగు చూసింది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం ప్రేమికులైన దళిత యువతీ యువకులు జులై 13వ తేదీ బైక్‌ పై వెడుతుండగా , ముగ్గురు దుండగులు వారిని కత్తులతో, రాడ్లతో అటకాయించారు. యువకుడిని కొట్టి, సెల్‌ఫోన్‌ లాక్కుని అతణ్ణి అక్కడినుంచి బలవంతగా పంపించేశారు. అనంతరం  ప్రియురాలు(20)ని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కొనిపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మరో ఇద్దరు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ పాశవిక కృత్యంతో ఆమెకు గర్భస్రావమైంది.  మరోవైపు ప్రియురాల్ని కాపాడలేకపోయానన్న ఆవేదనతో ఆ యువకుడు ఊర్లో ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జూలై 13 రాత్రి  బన్స్‌వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సునీల్, జితేంద్ర, వికాస్, విజయ్, పప్పు గుర్జార్‌గా గుర్తించామని బన్స్‌వారా డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్, ప్రభతి లాల్ తెలిపారు. నిందితుల్లో నలుగురిని ఆదివారం అరెస్టు చేయగా, ఒకరిని జూలై 26న అరెస్టు చేశామన్నారు. యువకుడి తండ్రి, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు సహా, కిడ్నాప్‌, సామూహిక అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ  వేధింపుల చట్టం కింద  కేసులు నమోదుచేశామని డీఎస్‌పీ తెలిపారు.

>
మరిన్ని వార్తలు