బర్గర్‌ కింగ్‌ ఔట్‌లెట్‌లో వెలుగు చూసిన సంఘటన

21 May, 2019 08:19 IST|Sakshi

ముంబై : ఓ వ్యక్తి బర్గర్‌ తిని రక్తం కక్కుకున్న సంఘటన గత బుధవారం పుణేలో చోటు చేసుకుంది. వివరాలు.. సజీత్‌ పఠాన్‌ అనే వ్యక్తి(31) తన స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి గాను సమీప ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న బర్గర్‌ కింగ్‌ ఔవుట్‌లెట్‌కి వెళ్లాడు. అనంతరం సజీత్‌ ఓ బర్గర్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, సాఫ్ట్‌ డ్రింక్‌ ఆర్డర్‌ చేశాడు. ఫుడ్‌ వచ్చిన తర్వాత బర్గర్‌ తీసుకుని కాస్తంత తిన్నాడు. వెంటనే ఉక్కిరిబిక్కిరి అవ్వడమే కాక రక్తం కక్కున్నాడు. గొంతు నొప్పితో విలవిల్లాడాడు. దాంతో సజీత్‌ తెప్పించుకున్న బర్గర్‌ని పరిశీలించగా.. దానిలో పగిలిన గ్లాస్‌ ముక్కలు కనిపించాయి. వెంటనే సజీత్‌ స్నేహితులు అతన్ని సమీప ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు.

విషయం తెలుసుకున్న స్టోర్‌ యజమాన్యం.. అప్పటికప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సజీత్‌కు రూ. 15 వేలు చెల్లించింది. మరుసటి రోజు అంతకు రెట్టింపు డబ్బులు ఇచ్చి.. ఈ విషయం బయటకు చెప్పవద్దని కోరింది. దీని గురించి ఔట్‌లెట్‌ మానేజర్‌ని ప్రశ్నించగా.. తనకు ఈ విషయం గురించి తెలీదని.. ఆ రోజు సెలవులో ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం సజీత్‌ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందన్నారు డాక్టర్లు. అతని శరీరంలోకి చేరిన గ్లాస్‌ ముక్క అదే బయటకు వస్తుందని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెడికల్‌ రిపోర్ట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అవి రాగానే బర్గర్‌ కింగ్‌ ఔట్‌లెట్‌ మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు