ప్రాణాలు విడిచిన రైల్వే ఉద్యోగి?

26 Jul, 2018 11:16 IST|Sakshi
మృతదేహం నుంచి స్వాధీనం చేసుకున్న గుర్తింపు కార్డు

ఒంగోలు: రైలులో నుంచి జారిపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరిగింది. డౌన్‌లైన్‌లో జరిగిన ఈ ఘటనలో యువకుడు పడిపోయిన తరువాత మృతదేహాన్ని రైలు ఈడ్చుకువెళ్లినట్లు పోలీసులు  అంచనాకు వచ్చారు. మృతదేహం కూడా ముక్కలుగా అయిపోయి చూసేందుకు భయంకరంగా మారింది. మృతుని వయస్సు 26 సంవత్సరాలు ఉండవచ్చని అంచనావేస్తున్నారు. మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా కె.మణికంఠారెడ్డిగా భావిస్తున్నట్లు ఒంగోలు జీఆర్‌పీ ఎస్సై అహ్మద్‌బాషా తెలిపారు. తెలంగాణాలోని మౌలాలిలో ఉన్న జోనల్‌ రైల్వే ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 5/18 బ్యాచ్‌లో ప్రొబెషన్‌ శిక్షణ పూర్తిచేసుకున్నట్లు గుర్తింపు కార్డు ద్వారా తెలుస్తోంది. యువకుడ్ని గుర్తించిన వారు ఒంగోలు జీఆర్పీ ఎస్సై సెల్‌ నంబర్‌ 9440627647ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

రైల్వే ట్రాక్‌ పక్కన..
మార్కాపురం రూరల్‌: రైల్వే ట్రాక్‌ పక్కన గుర్తు తెలియన వ్యక్తి మృత దేహం లభ్యమైన సంఘటన మండలంలోని గోగులదిన్నె గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద మంగళవారం రాత్రి  చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ రంగ స్వామి తెలిపిన వివరాల ప్రకారం మార్కాపురం రైల్వే స్టేషన్‌ నుంచి కంభం వైపు వెళ్లే రహదారిలో గోగులదిన్నె గ్రామం మీదుగా వెళ్లే రైల్వే ట్రాక్‌ పక్కన మృత దేహం లభ్యం అయింది. మృతునికి దాదాపు 40 సంవత్సరాలుంటాయని, ఇతని వద్ద ఎటు వంటి ఆధారాలు లేవని, బ్లూ జీన్స్‌ ప్యాంట్‌తో పాటు వంకాయ కలర్‌ ఉన్న పుల్‌ హ్యాండ్స్‌ షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. రైలు గేటు వద్ద కుర్చుని ఉండటం వలన  ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలిస్తే 9908093609 నంబర్‌ను సంప్రదించాలన్నారు. మృత దేహాన్ని స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు