నిందితుల బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య

16 Aug, 2019 13:27 IST|Sakshi

జైపూర్‌: కుమారుడిని చంపేశారు.. న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించడంతో మిగతా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరించారు. నిందితుల బెదిరింపులకు భయపడి కళ్లు లేని ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రత్తిరన్‌ జాతవ్‌ అనే వ్యక్తి అంధుడు. అతడికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద కుమారుడు హరీశ్‌ జాతవ్‌ గత నెలలో ఓ యాక్సిడెంట్‌ చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో సదరు మహిళ బంధువులు హరీశ్‌ మీద దాడి చేసి చంపేశారు. దీని గురించి అతడి తండ్రి రత్తిరన్‌ పోలీసుకుల ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హరీశ్‌పై దాడి చేసి, అతని చావుకు కారణమయిన వ్యక్తులు కేసు వాపసు తీసుకోవాలని.. లేదంటే రత్తిరన్‌ కుటంబ సభ్యుల్లో ఎవ్వరిని వదలమని బెదిరించారు.

ఈ బెదిరింపులకు భయపడిన రత్తిరన్‌ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి హరీశ్‌ సోదరుడు మాట్లాడుతూ.. ‘న్యాయం చేయాలంటూ మా నాన్న పోలీసులను ఎంతో వేడుకున్నాడు. కానీ వారు కనికరించలేదు. మమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ వారు మా మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ వారు ముందుగానే స్పందించి ఉంటే.. ఈ రోజు మా నాన్న మరణించేవారు కాదు. మాకు న్యాయం జరగదనే భయంతోనే మా నాన్న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వాపోయారు.

>
మరిన్ని వార్తలు