అన్నానగర్: కృష్ణగిరి సమీపంలో శనివారం ప్రసాదంలో విషయం కలిసి తన చిన్నారులకు ఇచ్చిన ఓ కిరాతక తండ్రి.. వారు చనిపోలేదని తెలుసుకుని గొంతు నులిమి చంపేశాడు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా కావేరీపట్నం సమీపంలోని ఎన్.తట్టకల్ గ్రామానికి చెందిన కడలరసు (32) కార్మికుడు. ఇతనికి, ధర్మపురి సాహితీ సంస్థకు చెందిన జనని(23)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు దేవరాజ్ (4), కుమార్తె నివంతిక (2) ఉన్నారు. దివరాజ్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు.
భార్యభర్తకు తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో శనివారం కడలరసు కుటుంబ సమేతంగా పెరియమలై ఆలయానికి వెళ్లారు. మార్గమధ్యంలో కడలరసు కొండ దిగువన అందించే ప్రసాదాన్ని కొని అందులో విషం కలిపి ఇద్దరు పిల్లలకు ఇచ్చాడు. దీంతో చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో పిల్లలు చనిపోలేదని భావించిన కడలరసు ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత అతని భార్య జననికి కూడా విష ప్రసాదం ఇచ్చాడు. చివరిలో తానూ తిని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో షాక్ తిన్న జనని కేకలు వేసింది.
స్థానికులు గుర్తించి నాగరసంబట్టి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భార్యాభర్తలను రక్షించి అంబులెన్స్లో కష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఇద్దరు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.