భర్త వేధింపులతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

3 Dec, 2023 13:34 IST|Sakshi

అనకాపల్లి: మాకవరపాలెం మండలం కె.వెంకటాపురానికి చెందిన ఎస్‌బీఐ ఉద్యోగి సిహెచ్‌. హేమ అరుంధతి (36) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూరల్‌ ఎస్సై ధనుంజయనాయుడు వివరాల ప్రకారం.. నర్సీపట్నం ఎస్‌బీఐ(బజార్‌)లో పనిచేస్తున్న ఆమె భర్త వేధింపులతో మనస్తాపానికి గురైంది. శుక్రవారం సాయంత్రం పెదబొడ్డేపల్లి సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ వెనుక జీడితోటల్లోకి స్కూటీపై వెళ్లింది.

అక్కడ స్కూటీ పార్కు చేసి, తన శవాన్ని చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటూ తెల్లకాగితంపై ఫోన్‌ నంబరు రాసింది. తన దగ్గర చున్నీతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మొదటి భర్త చనిపోవడంతో రాజమహేంద్రవరానికి చెందిన సహాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి వేధింపులు భరించలేక గతేడాది నవంబర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. మృతురాలికి మూడేళ్ల బాబు, తల్లిదండ్రులు ఉన్నారు. సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

 

మరిన్ని వార్తలు