పక్కాప్లాన్‌తో చోరీలు

9 Aug, 2019 11:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దొంగ పనిమనుషులతో జరజాగ్రత్త  

అప్రమత్తంగా లేకపోతే చోరీలు   

వివరాలు తెలుసుకున్నాకే తీసుకోవాలి

 ‘మా ఇంట్లో నగలు, నగదు పోయాయి. అప్పటినుంచి పనిమనిషి అందుబాటులో లేకుండా పోయాడు. అప్పటికే అతను దొంగ అన్న అనుమానం వచ్చింది. అయినా నమ్మించి నగలతో ఉడాయించాడు
– మూడు నెలల క్రితం పేట్‌బషీరాబాద్‌ ఠాణాలో ఓ గృహిణి ఫిర్యాదు  

‘ఉత్తరప్రదేశ్‌ నుంచి బతుకు దెరువు కోసం సిటీకి వచ్చాం. ఏమైనా పని ఉంటే చూసిపెట్టండి. ఏ పనైనా చేస్తానని చెప్పడంతో నమ్మిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దంపతులు మరేమీ ఆలోచించకుండా పనిలో పెట్టుకున్నారు. అయితే వీరు శుభకార్యాలయ సమయంలో ధరించిన నగలు ఎక్కడపెడుతున్నారో గమనించి సమయం కోసం వేచిచూసి ఉడాయించారు.  – మాదాపూర్‌ ఠాణాలోబాధితుల ఫిర్యాదు

సాక్షి, సిటీబ్యూరో: ఈ రెండు కేసులే కాదు పనిమనుషుల విషయంలో సరైన విచారణ లేకుండా నియమించుకుంటున్న యజమానుల ఇళ్లలోనే విలువైన వస్తువులు, నగదుతో పనిమనుషులు ఉడాయిస్తున్న ఘటనలు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. అయితే వారు పనిలో చేరే ముందే పక్కా ప్రణాళికతోనే సమయం కోసం వేచి చూసి దొంగతనాలు చేస్తూ యజమానులకు టోపీ పెడుతున్నారనే విషయం పోలీసు స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తే రూడీ అవుతోంది.  

ఖరీదైన కాలనీలే టార్గెట్‌...
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి  వేలమంది బతుకుదెరువు కోసం వస్తుంటారు. అయితే కొందరు మాత్రం  పనిపేరు చెప్పుకొని దొంగతనాలు చేయడమే లక్ష్యంగా విధించుకొని పనిమనుషులుగా చేరిపోతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లలో నగరానికి చేరుకుంటున్న వీరు శివారుల్లోని ఖరీదైన కాలనీల్లో తిరిగి తాము ఎంపిక చేసుకున్న ఇళ్లకు వెళ్లి మారుపేర్లతో యజమానులను పరిచయం చేసుకుంటున్నారు. పొట్టచేత పట్టుకొని వచ్చామని ఏ పని అప్పగించినా చేస్తామని నమ్మిస్తారు.దీంతో జాలిపడిన కొందరు యజమానులు వారిని పని మనుషులుగా చేర్చుకుంటున్నారు. ఆ తర్వాత యజమానులు నమ్మించి సరైన సమయం కోసం వేచి చూసి ఇంట్లోని బంగారం, నగదును ఎత్తుకెళుతున్నారు. ముఖ్యంగా  సీనియర్‌ సిటిజన్స్, ఉద్యోగాలు చేసే వారి ఇళ్లనే వీరి లక్ష్యంగా చేసుకొని చోరీలు చేస్తుండటం ఆం దోళన కలిగించే అంశంగా మారింది.  దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 

చోరీకి ముందు ఇదంతా చేస్తారు...
దొంగతనం చేయడమే లక్ష్యంగా ఇళ్లలో పనికి చేరేవారు. పనికి కుదిరిన తర్వాత ముందుగా ఆ ఇంటి యజమానుల మనస్తత్వం గమనిస్తారు. భార్యాభర్తల అన్యోన్యతను, వారి మధ్య బేధాభిప్రాయాలను పసిగడతారు. తర్వాత ఇద్దరి బలహీనతలు తెలుసుకొని ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మిస్తుంటారు. ఇంట్లో బంగారం, డబ్బు తదితర వస్తువులు ఎక్కడ దాస్తుంటారు. ఒకవేళ బ్యాంకులో ఉంచితే ఏ సమయంలో వాటిని ఇంటికి తెస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలప్పుడు వేసుకున్న నగలు తిరిగి ఎక్కడ పెడుతున్నారనే విషయాలను గమనిస్తుంటారు. ఆతర్వాత దొంగతనాన్ని చేసేస్తారు.  

వివరాలు తెలుసుకున్న తరువాతే నియమించుకోవాలి
పరిచయస్తుల ద్వారా రెఫరెన్స్‌ తీసుకుని పని మనుషులను చేర్చుకోవడం ఉత్తమం. ఒకవేళ ఆలా వీలుకాకపోతే పనిలోకి తీసుకునే ముందు ఎక్కడ పనిచేశారనే వివరాలను తెలుసుకోవడంతో పాటు ఎక్కడ నివాసం ఉంటున్నారనే సమాచారాన్ని సేకరించాలి.  వారి గుర్తింపు కార్డులు (ఆధార్‌ కార్డు, రేషన కార్డు, ఓటర్‌ ఐడీ) చూడాలి. సైబరాబాద్‌ పోలీసుల హాక్‌–ఐ యాప్‌లో పని వారి వివరాలు రిజిస్టర్‌ చేయించాలి. అలాగే ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవడం ఉత్తమం. పనిమనుషులముందు ఇంట్లోని అన్ని విషయాలు చర్చించకూడదు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు మాట్లాడకూడదు. మితిమీరిన స్వేచ్ఛను ఇవ్వవద్దు. అనుమానం కలిగితే పనితీరు, ప్రవర్తన ఇతర కార్యకలాపాలపై కన్నేసి ఉంచాలి.  ఇంట్లోని తాళపు చెవిలన్నిటినీ ఒకేచోట ఉంచకుండా వేర్వేరు చోట్లలో ఉంచాలి. ఆఫీసులకు వెళ్ళేవారు బీరువా, లాకర్లు, ఇతర ముఖ్యమైన తాళాలను తమ వెంట తీసుకువెళ్లాలి.  పనివారికి కనిపించే విధంగా విలువైన వస్తువులు, తాళాలు ఉంచరాదు.  ఎక్కువ మొత్తంలో డబ్బు, నగలు  బ్యాంకు లాకర్లో పెట్టడం మంచిది.
–రోహిణి ప్రియదర్శిని,సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ

మరిన్ని వార్తలు