బండ్ల గణేష్‌పై అట్రాసిటీ కేసు నమోదు

11 Jan, 2018 11:42 IST|Sakshi

ఇటీవల వరుస వివాదాలతో హల్‌చల్‌ చేస్తున్న టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్లగణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌కు చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు భూమిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు. ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో ఉన్న ఈ పౌల్ట్రీ ఫామ్‌లను ఒప్పందం ప్రకారం బ్యాంకు రుణాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

అయితే బ్యాంక్ ఇచ్చిన గడువులోగా రుణాలను గణేష్‌ తిరిగి చెల్లించకపోవటంతో ఆ పౌల్ట్రీ ఫామ్‌లతో పాటు దిలీప్ చంద్రకు చెందిన ఇంటిని కూడా బ్యాంకు అధికారులు సీజ్ చేసి, వారి ద్వారానే ఆ ఆస్తులను సీజ్ చేశారు. తరువాత తమకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి గణేష్‌ పౌల్ట్రీ ఫామ్‌ ఆఫీసుకు వెళ్లారు. ఆసమయంలో గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో తమను దూషించారంటు కౌన్సిలర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిరువురిపై అట్రాసిటీ కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు