ప్రియాంకారెడ్డి చివరి ఫోన్‌కాల్‌

28 Nov, 2019 15:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘భయమవుతోంది పాప నాకు. ప్లీజ్‌ కొంచెం సేపు మాట్లాడు’ అంటూ ప్రియాంకారెడ్డి ఫోన్‌లో చివరిసారిగా తన సోదరితో మాట్లాడింది. వాళ్లను చూస్తుంటే భయమవుతోందని, ఏడుపు వస్తోందని తన చెల్లి భవ్యారెడ్డితో దీనంగా చెప్పింది. రాత్రిపూట రోడ్డు మీద ఒక్కదాన్నే ఉన్నానని, చాలా టెన్షన్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. కొంచెంసేపు తనతో మాట్లాడాలని సోదరిని ఫోన్‌లో కోరింది. తన స్కూటీ వెనుక టైరు పంక్చర్‌ కావడంతో అక్కడ ఉన్న లారీలోంచి ఓ వ్యక్తి వచ్చి పంక్చర్‌ వేయించుకొస్తానని బండి తీసుకెళ్లాడని ప్రియాంక చెప్పింది. తాను వెళ్లిపోతానంటే వద్దని తన వెంటబడ్డాడని భయంగా చెప్పింది. సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు వెళ్లాలని ప్రియాంకకు సోదరి సూచించగా అక్కడ నిలబడితే అందరూ తననే చూస్తారని సమాధానం ఇచ్చింది. ‘చాలా భయంగా ఉంది. ఈ దెయ్యం మొహపోడు నా బండి ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ అస్సలు నిలబడాలని లేదు. బైక్‌ వచ్చే వరకు కాసేపు మాట్లాడు’ అంటూ సోదరితో ఫోన్‌లో మాట్లాడింది.

తర్వాత ఆమె ఫోన్‌ స్విచ్ఛాప్‌ అయిపోయింది. దీంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రియాంకరెడ్డి దారుణ హత్యతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. (ప్రాథమిక వార్త: షాద్‌నగర్‌లో యువతి సజీవ దహనం)

మరిన్ని వార్తలు