ప్రముఖ సింగర్‌ భార్య మృతి

13 Aug, 2019 14:26 IST|Sakshi

తిరువనంతపురం : మలయాళ ప్రముఖ గాయకుడు బిజు నారాయణన్‌ భార్య శ్రీలత(44) మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె మంగళవారం మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి ఏడు గంటల సమయంలో శ్రీలత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా 1993లో గాయకుడిగా పరిచయమైన బిజు నారాయణన్‌... కేరళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మాతృభాషతో పాటు పలు దక్షిణ భారత భాషల్లో 400 పైగా పాటలు పాడి అభిమానులను సంపాదించుకున్నారు. ఉత్తమ గాయకుడిగా పలు అవార్డులు కూడా పొందారు.

ఇక ఎర్నాకులంలోని మహరాజా కాలేజీలో విద్యనభ్యసించిన బిజుకు... అక్కడే శ్రీలత పరిచయమైంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 1998లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సిద్ధార్థ్‌, సూర్య ఉన్నారు. సిద్ధార్థ్‌ లా చదువుతుండగా, సూర్య హైస్కూల్‌ విద్యనభసిస్తున్నాడు. వీరిద్దరికి కూడా సంగీతం అంటే మక్కువ ఉందని, డీజేగా సాధన చేస్తున్నారని బిజు గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా శ్రీలత మృతి పట్ల బిజు సన్నిహితులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు