మళ్లీ కార్డెన్‌ సెర్చ్‌

18 Apr, 2018 13:03 IST|Sakshi
స్థానికులకు సూచనలిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో పెబ్బేరులో తనిఖీలు  

పత్రాలు లేని వాహనాలు స్టేషన్‌కు తరలింపు

నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి

పెబ్బేరు (కొత్తకోట): వనపర్తిని నేర రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఇన్‌చార్జ్‌ ఎస్పీ రెమారాజేశ్వరి పెబ్బేరులో రెండుసారి కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ఇన్‌చార్జ్‌ అదనపు ఏఎస్పీ భాస్కర్, వనపర్తి డీఎస్పీ సృజన పర్యవేక్షణలో ముగ్గురు సీఐలు, 9 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, ఓంగార్డులు కలిపి సుమారు 100 మంది ఏడు బృందాలుగా విడిపోయి పట్టణంలో తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్, గాయత్రినగర్, సినిమా టాకిస్‌ కాలనీ, మార్కెట్‌ వెనకాల, ఓల్డ్‌ఆర్టీఏ కార్యాలయంలో కాలనీలో తనిఖీలు చేపట్టారు. అనుమానితులు ఎవరైనా ఇంటి అద్దెకు తీసుకొని ఉంటారనే అనుమానంతో వారి ఆధార్‌ కార్డు, ఐడి ఇతర ఆదారాలు సేకరించి పరిశీలించారు. అనంతరం ఎలాంటి పత్రాలు లేని 34 మోటర్‌ సైకిళ్లు, 2 ఆటోలను సీజ్‌ చేసి పెబ్బేరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

నేరాల అదుపునకు సహకరించాలి
నేరాలు అదుపులో ఉండాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని ఇన్‌చార్జ్‌ ఎస్పీ రెమా రాజేశ్వరి కోరారు. కార్డెన్‌ సెర్స్‌లో భాగంగా బస్తి ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుతం చేస్తున్న సోదాలు ప్రజల సంక్షేమం కోసంమేనని, అసాంఘిక శక్తుల ఆట కట్టించి నేరస్తులు తప్పించుకోకుండా ఉండేందుకు తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా అనుమానస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.  ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని, ఆధార్‌ కార్డు జిరాక్స్‌తోపాటు పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వాలన్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేని వాహనాలు నడిపితే  చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో కొత్తకోట సీఐ సోమ్‌నారాయణసింగ్, ఆత్మకూర్‌ సీఐ శంకర్, వనపర్తి, పెబ్బేరు ఎస్‌ఐ ఓడి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు