సాక్షి, కరీంనగర్: చింతకాయలు తెంపుతూ చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కొని ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది నుంచి వచ్చిన నిమ్మల బాలనర్సు (44) భార్య మాధవి, కూతురు లహరి (14)తో కలిసి సిరిసిల్ల పరిధిలోని జగ్గారావుపల్లెలో ఉంటున్నాడు. భార్యాభర్తలు వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నారు. బుధవారం సిరిసిల్ల మార్కెట్లో నిమ్మకాయలు విక్రయించి ఇంటికి వెళ్లే క్రమంలో బాలనర్సు గ్రామ శివారులోని చింతచెట్టు ఎక్కాడు. చింతకాయలు తెంపి చెట్టు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారి కొమ్మల మధ్య ఇరుకున్నాడు. ఈ క్రమంలో లుంగీ గొంతుకు బిగించుకుపోగా చెట్టుపైనే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి?