వ్యభిచారం గుట్టురట్టు

29 Jul, 2019 11:45 IST|Sakshi
వ్యభిచారిణులు, విటులను అరెస్టు చేసిన పోలీసులు  

కందుకూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. 

మూడు రోజల క్రితం వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారిణులు, విటులు కోర్టుకు హాజరు

సాక్షి, కందుకూరు అర్బన్‌: కొంతకాలంగా కందుకూరు పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం గుట్టు ఎట్టకేలకు రట్టయింది. విచ్చలవిడిగా సాగుతున్న ఈ చీకటి బాగోతంపై గుర్తు తెలియని వ్యక్తుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఓ వ్యభిచార గృహంపై ఆకస్మికంగా దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వ్యాభిచార గృహం నిర్వాహకులు ధనవంతులు కావడంతో పట్టుబడిన వారిని గుట్టుచప్పుడు కాకుండా కోర్టుకు హాజరు పరిచారు. కొన్నేళ్లగా పట్టణంలో వ్యభిచారం మూడు పువ్వులు..ఆరుకాయలుగా సాగుతోంది. కొందరు బ్రోకర్లు ఒంగోలు, నెల్లూరు, గూడూరు, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. 

పట్టణానికి చెందన కొందరి అండతో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్రోకర్లు రాత్రి సమయాల్లో ఆటోలు, బస్సుల్లో మైనర్లకు మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపి వ్యభిచారం రొంపిలోకి దించుతున్నారు. అందుకు  పట్టణ శివారు ప్రాతాలను ఎంచుకున్నారు. కోవూరు రోడ్డు, విక్కిరాలపేట రోడ్డు, పామూరు రోడ్డు, పలుకూరు అడ్డ రోడ్డులోని జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని రాత్రి సమయంలో వ్యభిచారం సాగిస్తున్నారు. పోలీసుల రాత్రి సమయాల్లో పట్టణంలోని లాడ్జిలు, గెస్ట్‌హోసుల్లో తనిఖీలు చేయక పోవడంతో బ్రోకర్లు వ్యభిచారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం కోవూరు రోడ్డులోని ఓ ఇంట్లో వ్యభిచారం సాగిస్తున్నారని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, విటులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారు ధనవంతులు కావడంతో మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా కోర్టులో హాజరు పరిచారు. రాత్రి వేళల్లో దంపతులు తమ స్వగ్రామాలకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. రాత్రి 9 గంటలు దాటితే మందుబాబులు అమ్మాయిలను తీసుకొచ్చి రోడ్డు పక్కనే మద్యం తాగుతూ తమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతోందోనని భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై పట్టణ ఎస్‌ఐ తిరుపతిరావును వివరణ కోరగా వ్యభిచార గృహంపై దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు