ఇద్దరు వృద్ధుల అనుమానాస్పద మృతి

6 Jul, 2018 10:45 IST|Sakshi
గుర్తుతెలియని వృద్ధురాలి, వృద్ధుడి మృతదేహాలు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన క్లూస్‌ టీం

పటాన్‌చెరు టౌన్‌: గుర్తుతెలియని ఇద్దరు వృద్ధులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వేణు గోపాల్‌ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాంచంద్రాపురం మండలం వెలమెల్ల గ్రామ శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన సుమారు 65 సంవత్సరాల గుర్తుతెలియని ఓ వృద్ధురాలు, సుమారు 70 సంవత్సరాల మరో వృద్ధుడు రోడ్డు పక్కన చెట్ల మధ్యలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

గురువారం ఉదయం ఔటర్‌ రింగు రోడ్డుపై పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నవారు ఇద్దరు వృద్ధుల శవాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి సీఐ వేణుగోపాల్‌ రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌ రెడ్డి, క్లూస్‌ టీం చేరుకొని పరిశీలించారు. వారి మృతికి గల కారణాలు ఏమిటో? రింగ్‌ రోడ్డు వద్దకు ఇద్దరు వృద్ధులు ఎలా వచ్చారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు