సిలిండర్‌ పేలి పూరిళ్లు దగ్ధం

14 Apr, 2018 11:37 IST|Sakshi
నెల్లిమర్లలో కాలిపోతున్న పూరిళ్లు

రూ. 5లక్షల ఆస్తి నష్టం  

నెల్లిమర్ల: నగర పంచాయతీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో శుక్రవారం మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు...పట్టణంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి సమీపంలోనున్న ఓ పూరింట్లో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది.

దీంతో పక్కపక్కనే ఉన్న ఇట్లా అప్పారావు, ఇట్లా అప్పలనర్సమ్మ, ఇట్లా రమణలకు చెందిన మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అప్పారావు కుమార్తెకు తాజాగా వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఖర్చుల నిమిత్తం అప్పు చేసిన నగదు రూ. 75 వేలు, మూడు తులాల బంగారం ఈ ప్రమాదంలో కాలి బూడిదైంది.

ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిత్యావసరాలు సైతం కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫోన్‌ చేసినప్పటికీ ఫైర్‌ ఇంజన్‌ రావడం ఆలస్యమైంది.

దీంతో వాహనం వచ్చేసరికి పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి వచ్చి ఆస్తి నష్టం అంచనా వేశారు. రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనా. 

మరిన్ని వార్తలు