సాక్షి, చెన్నై: తమిళనాడులోని తంజావూరు కార్పొరేషన్ కమిషనర్ వరదరాజన్ ఏసీబీ వలలో చిక్కారు. తంజావూరుకు చెందిన సంబంధం అనే వ్యక్తి తనకున్న ఖాళీ స్థలానికి పన్ను విషయమై కార్పొరేషన్ వర్గాలను ఆశ్రయించాడు. అయితే పన్ను మరీ ఎక్కువగా ఉండటంతో వ్యవహారం కమిషనర్ వద్దకు చేరింది. కమిషనర్ సన్నిహితుడు నాగరాజన్ రంగంలోకి దిగి రూ.75 వేలు ఇస్తే అన్నీ సక్రమంగా సాగేలా చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం శుక్రవారం ఉదయం ఏసీబీ వర్గాలు ఇచ్చిన నోట్లను తీసుకుని కమిషనర్ను కలిశాడు. నాగరాజన్తో కలిసి ఆయనకు రూ.75 వేలు అందించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కమిషనర్, అతడి సన్నిహితుడిని అరెస్టు చేశారు.